నరేంద్ర మోడీ సభకు బస్సులు: ప్రధానమంత్రికి లేఖ
ఖండ్వా: తన స్కూల్ బస్సును ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి కేటాయించడం వల్ల తాను స్కూల్కు వెళ్లలేకపోతున్నానని నిరాశతో ఓ బాలుడు ఏకంగా మోడీకే లేఖ రాశాడు. 'మోడీ అంకుల్.. మా స్కూల్ కంటే మీకు సభ, ర్యాలీ ముఖ్యమా?' అంటూ ప్రధానికి రాసిన లేఖతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం స్కూల్ బస్సును ప్రధాని సభకు ఉపయోగించడాన్ని రద్దు చేశారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్పూర్ జిల్లాలో జరిగే ప్రధాని సభ కోసం బస్సులు పంపించాల్సి వస్తున్నందున మంగళవారం, బుధవారం స్కూల్ మూసేస్తున్నట్లు టీచర్ చెప్పారని 8వ తరగతి చదువుతున్న దేవాన్ష్ తన లేఖలో పేర్కొన్నాడు.
అలాగే లేఖలో మోడీని ఉద్దేశిస్తూ.. 'మీరు అమెరికాలో సభల్లో ప్రసంగించారని విన్నాను. అక్కడికి చాలా మంది వచ్చారు. అయితే వాళ్లు వేదిక వద్దకు స్కూల్ బస్సుల్లో రాలేదు' అని దేవాన్ష్ గుర్తు చేశాడు. 'నా కోరిక నెరవేర్చుతారని కోరుకుంటూ.. మా మోడీ అంకుల్ సభకు తమ తమ సొంత వాహనాలతో భారీ జనం రావాలని కోరుకుంటా' అని తెలిపాడు.
క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మోడీ మధ్యప్రదేశ్లో సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామం భభ్రలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ర్యాలీ కోసం స్కూల్ బస్సులు పంపించాలని ఆదేశించారు.
కాగా, దేవాన్ష్ రాసిన లేఖ బాగా వైరల్ అవ్వడంతో అధికారుల్లో స్పందన వచ్చింది. వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకుని స్కూల్ బస్సులను ర్యాలీకి ఉపయోగించొద్దని మరోసారి ఆదేశించారు. కాగా, ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న దేవాన్ష్ జైన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.