ఎల్వోసీని దాటి 20 మంది తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం?
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో ఇటీవల యూరి ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాక్ ఏకాకి అయింది. భారత దేశానికి గట్టి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో దాదాపు భారత్ - పాక్ సరిహద్దుల్లోని ఎల్వోసీని దాటి.. ఇరవై మంది తీవ్రవాదులను భారత సైన్యం మట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది.
ది క్వింట్లో వచ్చిన సమాచారం మేరకు.. 18 నుంచి 20 మంది సైనికులతో కూడిన రెండు యూనిట్ల సైన్యచం ఎల్ఓసీ దాటి హెలికాప్టర్లో వెళ్లి ఆపరేషన్ నిర్వహించారు. పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో దాదాపు ఇరవై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
అయితే, ఈ విషయమై భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ ఆపరేషన్ సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 21 తేదీల మధ్య చోటు చేసుకుందని సదరు మీడియా పేర్కోంది. మిలిటరీ సోర్సెస్ ఇచ్చిన సమాచారం మేరకు వెల్లడించినట్లు పేర్కొంది.
కాగా, పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లో నో ఫ్లయింగ్ జోన్ను పాకిస్తాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 20వ తేదీన ఈ ప్రకటన చేసింది. ఈ కారణంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్.. నార్త్ వెస్టర్న్ పాకిస్తాన్ నగరాలకు విమానాలను రద్దు చేసింది. విమానాలు రద్దు చేసిన ప్రాంతాల్లో గిల్గిత్, స్కర్డు కూడా ఉన్నాయి.
మరోవైపు, భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. యూరి దాడి పైన చాలా సీరియస్గా ఉన్నట్లు ప్రకటించారు. యూరి దాడికి ఎలా ప్రతీకారం తీసుకోవాలో ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ అంశం పైన చాలా సీరియస్గా ఉన్నట్లు చెప్పారు.
మరోవైపు, సెప్టెంబర్ 20, 21 తేదీలలో ఎల్వోసీని దాటి ఇరవై మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లుగా వస్తున్న వార్తలను మిలటరీ కొట్టి పారేసింది.