పాక్ కు ఎలా బుద్ది చెప్పాలి? : ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ మరో భేటీ
న్యూఢిల్లీ : యురీ ఉగ్ర ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాక్ ఉగ్రవాదుల తీరును ప్రతీ ఒక్క భారతీయుడు ముక్త కంఠంతో ఖండిస్తున్నాడు. కాగా, పాక్ ద్వంద్వ నీతికి ఎలా బుద్ది చెప్పాలన్న ఆలోచనలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విషయమై సోమవారం నాడు ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరగ్గా.. సమగ్ర నిర్ణయమేది తీసుకోలేదు.
ఈ నేపథ్యంలోనే మరోసారి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్. పాక్ పై ఎలాంటి చర్యలకు దిగాలన్న అంశంపై ఉన్నతాధికారులతో ఆయన చర్చిస్తున్నారు. మంగళవారం నాడు ఎన్ఎస్ఏ ధోవల్, ఐబీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఉగ్ర ఘటన తర్వాత పాక్ స్పందించిన తీరుపై కూడా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ స్పందన పరోక్షంగా యుద్ద ప్రస్తావనను తీసుకురావడంతో.. భారత్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న.