భారత్ కు చేరిన అమెరికా సాయం: కరోనా అత్యవసర సామాగ్రితో ఢిల్లీ చేరిన యూఎస్ మిలిటరీ విమానం
కరోనా సెకండ్ వేవ్ నుండి భారత దేశాన్ని కాపాడడానికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ముందుకు వచ్చాయి. దేశానికి సహాయపడటానికి చాలా దేశాలు వైద్య పరికరాలు ,ఇతర అవసరమైన సామాగ్రిని పంపించాయి. దేశంలో ఆరోగ్య సంక్షోభానికి కారణమైన కరోనా మహమ్మారి తో పోరాడుతున్న భారతదేశం ఈరోజు అమెరికా నుండి మొదటి కోవిడ్ అత్యవసర సహాయ సామాగ్రిని అందుకుంది.
భారత్ కు చేరుకున్న యూఎస్ తొలి సహాయం .. 400కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
400 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, దాదాపు ఒక మిలియన్ ర్యాపిడ్ కరోనావైరస్ టెస్ట్ కిట్లు మరియు ఇతర ఆసుపత్రి పరికరాలతో, సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్పోర్టర్ ఈ ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒక ట్వీట్లో, యుఎస్ ఎంబసీ భారతదేశానికి తాము సహాయం చేస్తామని ఇచ్చిన మాట మేరకు సహాయం అందిస్తున్నామని, సహాయానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది .
ట్వీట్ చేసిన యూఎస్ ఎంబసీ .. 70 సంవత్సరాల పరస్పర సహకారం అంటూ ట్వీట్
యుఎస్ ఎంబసీ చేసిన ట్వీట్ లో యునైటెడ్ స్టేట్స్ నుండి అనేక అత్యవసర కొవిడ్-19 సహాయక సరుకులలో మొదటిది భారతదేశానికి చేరుకుంది. 70 సంవత్సరాల పరస్పర సహకారంతో, యునైటెడ్ స్టేట్స్ భారతదేశంతో నిలుస్తుంది ,మేము సమిష్టిగా కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతాము అని #USIndiaDosti. అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ సహాయ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుంది .వాటిలో 1000 ఆక్సిజన్ సిలిండర్లు, కోటి 50 లక్షల ఎన్ 95మాస్కులు, 10 లక్షల ర్యాపిడ్ కిట్స్ , ఆస్ట్రాజెనికావ్యాక్సిన్ తయారీకి సంబంధించిన తయారీ సామాగ్రి భారత్ కు పంపిస్తున్నామని వెల్లడించింది.అందులో భాగంగా తొలి రోజు యూఎస్ సహాయం భారత్ కు అందింది.
వచ్చే వారంలో కూడా భారత్ కు సహాయం చేసేందుకు ప్రత్యక విమానాలు
యూఎస్ లోని వివిధ కంపెనీలు మరియు వ్యక్తులు విరాళంగా ఇచ్చే పరికరాలను కూడా తీసుకువచ్చే ప్రత్యేక విమానాలు వచ్చే వారంలో కూడా కొనసాగుతాయని అమెరికా అధికారులు తెలిపారు.ఈ వారం ప్రారంభంలో,అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కోవిడ్కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భారతదేశానికి నిరంతర మద్దతు ఇస్తానని స్పష్టమైన ప్రకటన చేశారు. మహమ్మారి ప్రారంభంలో మా ఆస్పత్రులు దెబ్బతిన్నందున భారతదేశం అమెరికాకు సహాయం పంపినట్లే, భారతదేశానికి అవసరమైన సమయంలో సహాయం చేయడానికి మేము నిశ్చయించుకున్నాము అని బైడెన్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
Recommended Video
యూఎస్ చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలిపిన పీఎం మోడీ
భారతదేశంలో మా భాగస్వాములకు అత్యవసర ఉపశమనం కలిగించడానికి రాబోయే రోజుల్లో యునైటెడ్ స్టేట్స్ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సామాగ్రిని పంపిణీ చేస్తోంది అని విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ఇరు దేశాలలో కోవిడ్ పరిస్థితిపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, బైడెన్ లు ఫోన్లో మాట్లాడారు. మేము రెండు దేశాలలో కరోనా పరిస్థితిని వివరంగా చర్చించాము. యునైటెడ్ స్టేట్స్ భారతదేశానికి అందిస్తున్న సహకారానికి అధ్యక్షుడు బైడెన్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పిఎం మోడీ పేర్కొన్నారు.