Gautam Adani: అదానీకి అమెరికా కోర్టు అరెస్టు వారెంట్- లంచం, మోసం ఆరోపణలు..!
భారతీయ బిలియనీర్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ లంచం, మోసం ఆరోపణల్లో చిక్కుకున్నారు. అమెరికాలో సోలార్ కాంట్రాక్టులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై గౌతం అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతరులపై న్యూయార్క్ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటు గౌతం అదానీ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది.
బహుళ-బిలియన్ డాలర్ల లంచం, మోసం పథకంలో గౌతం అదానీ పాత్రపై న్యూయార్క్లో అభియోగాలు మోపినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. అదానీ మరియు అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ముద్దాయిలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించేందుకు అంగీకరించారని అధికారులు వెల్లడించారు.

కొంతమంది కుట్రదారులు గౌతమ్ అదామీని "న్యూమెరో యునో", "పెద్ద మనిషి" వంటి కోడ్ పేర్లతో ప్రైవేట్గా సంభాషించినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. సాగర్ అదానీ తన సెల్ఫోన్ను లంచాల వివరాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించారని తెలిపారు.
అదానీ గ్రీన్ ఎనర్జీలో అదానీలు, మరో ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్, రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి అవినీతిని దాచిపెట్టడం ద్వారా ఆ కంపెనీకి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించారని న్యాయవాదులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అదానీ అరెస్టుకు అమెరికా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అలాగే స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications