ప్రధాని మోడీతో జో బైడెన్ భేటీ.. డ్రాగన్ ఆధిపత్యంపై చర్చ..?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ కాబోతున్నారు. ఈ నెల 24వ తేదీన సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. క్వాడ్ దేశాల సదస్సు సందర్భంగా వచ్చే శుక్రవారం రోజున ఇరువురు నేతలు భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది. జపాన్ ప్రధాని యోషిహిడే సుగతో బైడెన్ విడిగా చర్చిస్తారు.
భారత్, జపాన్ ప్రధానులతో బైడెన్ వేర్వేరు భేటీల తర్వాత ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలతో కలిపి ఏయూకేయూఎస్ కూటమి ఏర్పాటుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్ అదే రోజు కాస్త ఆలస్యంగా క్వాడ్ సదస్సులో పాల్గొంటారు.
ఏయూకేయూఎస్ కూటమి దేశాల మధ్య టాప్ టైర్ మిలిటరీ టెక్నాలజీ బదిలీతోపాటు మిలిటరీ అలయెన్స్ ఏర్పాటు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు భారత్ రష్యా, ఫ్రాన్స్లతో రక్షణ రంగ ఒప్పందాలు చేసుకుంటుండటం గమనార్హం. ఇండో పసిఫిక్ రీజియన్లో డ్రాగన్ ఆధిపత్యం కొనసాగుతోంది. దానిని నివారించడం కోసం భారత్ సహా అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే భారత్, జపాన్ ప్రధానులతో భేటీ కాబోతున్నారు.
Recommended Video
భారత్- చైనా మధ్య కూడా పరిస్థితులు అంత బాగో లేవు. తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్తలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ఇదే విషయాన్ని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు చెబుతూ వస్తోంది. చైనాను ఒంటరి చేయాలని అనుకుంటోంది. ఇందుకు అమెరికా సహా ముఖ్య దేశాలు అనుకూలంగా ఉన్నాయి. రష్యా కూడా పైకి ఓకే అన్నట్టుగా ఉన్న.. కమ్యునిస్ట్ దేశాన్ని వదులుకునే ఉద్దేశం లేనట్టు ఉంది.