మోడీ ట్రంప్లలో కామన్ అదే... భారీ ఒప్పందాలకు కట్టుబడి ఉంటారా..?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. డొనాల్డ్ ట్రంప్కు తన పేరు ఎప్పుడూ వార్తల్లో నిలవాలనేది ఆయన కోరిక. అందుకే ఏదో ఒక విషయంలో ప్రతిరోజూ ట్రంప్ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక అమెరికా అధ్యక్షుల వారు ఏదైనా బహిరంగ సభకు వెళ్లాలంటే ముందుగా అక్కడ జనసమీకరణ గురించే చర్చిస్తారు. సభకు ఎంతమంది హాజరవుతారు అనేదానిపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇక తాజాగా భారత్కు వస్తున్న ట్రంప్ ముందుగానే సభకు ఎంతమంది హాజరవుతారనేదానిపై వాకాబు చేశారు. అందుకే ముందుగా 10 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని ట్రంప్ చెప్పారు. జనసమీకరణ విషయంలో మోడీ కూడా ట్రంప్కు ఏమాత్రం తగ్గరు. ప్రధాని మోడీ కూడా ఎక్కువ మంది ప్రజలు ఉండాలనే కోరుకుంటారు.

తన కార్యక్రమంకు పబ్లిసిటీని ఇష్టపడే ట్రంప్
ఇక తాజాగా ట్రంప్ తన భారత పర్యటన గురించి మాట్లాడుతూ తనకు స్వాగతం పలికేందుకు 7 మిలియన్ మంది వస్తారని చెప్పారు. ట్రంప్ చెప్పినట్లుగా 7 మిలియన్ మంది రావాలంటే ఆ సంఖ్య అహ్మదాబాద్ నగరం యొక్క 80శాతం జనాభా. ఇది సాధ్యం కాదు. ఇక ప్రజలు వారి హాజరు అనే అంశాలను పక్కన బెడితే ట్రంప్ పర్యటన సందర్భంగా విధానాపరమైన అంశాలపై స్పష్టత లేదు. ఇక ట్రంప్ను మోడీ ఆకాశానికి ఎత్తటంపై అక్కడి డెమొక్రాట్లు జీర్ణించుకోలేకున్నారు. అంతేకాదు ట్రంప్ సొంత పార్టీలోని రిపబ్లికన్లు కూడా మోడీ వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు. ఈ మధ్యే కశ్మీర్ అంశంపై మ్యూనిచ్లో జరిగిన భద్రతా సమావేశంలో సెనేటర్ లిండ్సే గ్రాహం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ల మధ్య జరిగిన చర్చలు ఒక్కింత అసంతృప్తినే మిగిల్చాయి.

క్రమంగా తగ్గుతూ వచ్చిన వాణిజ్య సంబంధాలు
పేపర్లపై భారత ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అది పతనస్థాయికి దిగజారింది. ఇక అమెరికా భారత్ల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అమెరికాతో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదనే ట్రంప్ మాటలే ఇందుకు నిదర్శనం. వాణిజ్య పరంగా ఉన్న భారత్ విధించిన నిబంధనలు చూస్తే ఇక అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలువలేమని అమెరికా ప్రకటించింది. ఇక ట్రంప్ పర్యటన సందర్భంగా ఏదైనా భారీ ఒప్పందాలు కుదుర్చుకుందామని ఆశించిన భారత్కు ట్రంప్ మాటలు చెక్ పెట్టాయి.

ఇప్పటి వరకు అణుఒప్పందం మాత్రమే భారీ డీల్
మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మాజీ భారత ప్రధాని మన్మోహన్సింగ్ల మధ్య జరిగిన అణుఒప్పందం తర్వాత ఇప్పటి వరకు భారీ డీల్స్ అమెరికా భారత్ల మధ్య ఏవీ జరగలేదు. అమెరికా భారత్ల మధ్య అణుఒప్పందం జరగడంతో ప్రపంచదేశాలకు భారత్ అణుశక్తిగా ఎదుగుతోందన్న సంకేతాలు వెళ్లాయి. ఇక ఆ తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా కాస్త పొసగలేదు. అయినప్పటికీ ఒక అగ్రరాజ్యం అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారంటే ఇది భవిష్యత్తులోనైనా ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మంచి సంబంధాలు కొనసాగాలంటే ఇరు దేశాల నుంచి కొంతలో కొంతైన కదలిక ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు.
Recommended Video


అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలను కోరుకుంటోంది
ఇక అణు ఒప్పందంతో అమెరికాకు ఒరిగింది ఏమీ లేదు అయితే హార్లీ డేవిడ్సన్ బైకులపై టారిఫ్లను సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తామని చెప్పడంతో అమెరికాకు భారీ ఊరటనిచ్చింది భారత్. ఇక అమెరికా కూడా రెండు రకాల హెలికాఫ్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది. రెండిటికి 3.4 బిలియన్ డాలర్లను భారత్ వెచ్చించనుంది. ఇలా చేయడం ద్వారా భారత ప్రభుత్వం అమెరికాతో వాణిజ్యపరంగా మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలనే సంకేతాలు పంపుతోంది. అయితే ఇది సాధ్యపడుతుందా లేదా అనేది మాత్రం ట్రంప్ చేతుల్లోనే ఉంది. అయితే అమెరికాతో భారత్ సంబంధాలు కేవలం లావాదేవీలకే పరిమితం కాకూడదని భారత్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications