కొవిడ్ వ్యాక్సిన్లపై సంచలన మలుపు -పేటెంట్ హక్కుల రద్దుకు అమెరికా ఓకే -భారత్కు బైడెన్ మద్దతు, లేదా విలయమే
ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి కొత్తరకం వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ ఇకాస్త వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 15.5కోట్లకు, మరణాల సంఖ్య 32.55లక్షలకు పెరిగాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు మాత్రమే విరుగుడుగా పనిచేస్తుండటంతో అన్ని దేశాలూ టీకాలపై ఫోకస్ పెట్టాయి. కానీ అగ్రరాజ్యాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ముడి సరుకులను అమెరికా నిలిపేయడంతో భారత్ లాంటి మధ్యస్త దేశాలూ తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. అంతర్జాతీయంగా ఒక విధానమంటూ లేకపోతే రాబోయేరోజుల్లో వ్యాక్సిన్ విలయమూ తలెత్తే పరిస్థితి. ఈనేపథ్యంలో భారత్ ఓ కీలక ప్రతిపాదనను ప్రపంచం ముందుకు తెచ్చింది. ఆ ప్రతిపాదనకు అమెరికా మద్దతు పలకండం సంచలన మలుపుగా మారిందిప్పుడు..
అలెర్ట్: ఈనెల 8న భూమికి ముప్పు -అదుపుతప్పి దూసుకొస్తున్న చైనా రాకెట్ -ఎక్కడ పడుతుందో తెలీదు..
వ్యాక్సిన్ పేటెంట్లపై వివాదం..
ఏదైనా సంస్థ తాను కొత్తగా రూపొందించిన విషయాలకు మేధో, వినియోగపరమైన హక్కులు పొందే 'పేటెంట్' ప్రక్రియ మనందరికీ తెలిసిందే. కరోనా కట్టడి కోసం టీకాలు తయారుచేసిన ఫార్మా కంపెనీలు సైతం పేటెంట్ల కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే, కరోనా వ్యాక్సిన్ల విషయంలో పేటెంట్ హక్కులు యథావిథిగా కొనసాగితే గనుక పేద దేశాలకు టీకాలు అందని పరిస్థితి. అమెరికా, బ్రిటన్ వంటి ధనిక దేశాల్లోని ఫార్మా సంస్థలు తమకున్న అపారమైన వనరులు, సాంకేతికతతో కొవిడ్-19 వ్యాక్సిన్లను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసుకోవడం, కోట్లాది డోసులను తమ దగ్గరే నిల్వ ఉంచుకోవడం, ఇతర దేశాలకు ముడిసరుకులను కూడా నిషేధించడం లాంటి పరిణామాలతో భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రంగంలోకి దిగాయి. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన అన్ని పేటెంట్ హక్కులను మాఫీ చేయాలని గత అక్టోబర్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)కు విజ్ఞప్తి చేశాయి. తద్వారా వ్యాక్సిన్ తయారీ ఫార్ములా అన్ని దేశాలకు చేరడంతో.. ధనిక, పేద, మధ్యతరగతి అని తేడాలేకుండా స్వదేశీ వనరులతో అన్ని దేశాలు టీకాలను స్వతహాగా ఉత్పత్తి చేసుకోగలవని భారత్ ప్రతిపాదించింది.
అమెరికా మద్దతుతో మలుపు..
కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ఆయా ఫార్మా సంస్థలకు పేటెంట్ ఉండరాదన్న భారత్ ప్రతిపాదనను యురోపియన్ యూనియన్, కెనడా, చిలీ తదితర దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా కూడా తొలుత తటపటాయించినా చివరికి తలొగ్గింది. ప్రస్తుత విలయ పరిస్థితుల్లో కీలకమైన టీకా మేధో సంపత్తి హక్కుల రద్దుకు జో బైడైన్ నేతృత్వంలోని అమెరికా మద్దతు తెలిపింది. మహమ్మారిపై పోరులో ప్రపంచ దేశాలకు మద్దతునిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ట్రేడ్ ప్రతినిధి కేథరిన్ మీడియాకు వెల్లడించారు. పేటెంట్ హక్కుల పరిరక్షణకు బైడెన్ సర్కారు కట్టుబడి ఉంటుందని, కానీ, కరోనా వైరస్ టీకాల విషయంలో మాత్రం 'ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్'ను రద్దు చేయాల్సిన అవసరం ఉందని అమెరికా కూడా భావిస్తున్నట్లు కేథరిన్ తెలిపారు. వ్యాక్సిన్ పేటెంట్ల విషయంలో అమెరికా తాజాగా చేసిన ప్రకటనను కీలక మలుపుగా, అద్బుతమైన సందర్బంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. అమెరికా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గాబ్రేయేసస్ బుధవారం ప్రశంసించారు. నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. కాగా,
పేటెంట్ల రద్దు అంత ఈజీ కాదు..
కొవిడ్ వ్యాక్సిన్లపై అగ్ర రాజ్యాల గుత్తాధిపత్యం ఇప్పటికే ప్రస్ఫుటంగా కనిపిస్తోన్న దరమిలా వ్యాక్సిన్ పేటెంట్ల రద్దు కోసం భారత్, సౌతాఫ్రికాలు చేసిన ప్రతిపాదన నూరు శాతం అమల్లోకి రావడం అంత ఈజీగా జరిగేదికాదు. పేటెంట్ల రద్దు అంశంలో ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సూత్రాలకు అనుగుణంగా, అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరేందుకు సమయం పడుతుందని బైడెన్ ప్రతినిథి కేథరిన్ చెప్పిన మాట వ్యవహారంలోని సంక్లిష్టతను తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కోసం అనేక దేశాలు టీకాలు ఉత్పత్తి చేసేలా.. అంతర్జాతీయ వాణిజ్య నియమాలను సరళీకృతం చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. కానీ చాలా దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. పేటెంట్ల రద్దుకు ఏకాభిప్రాయం కావాల్సి ఉండగా.. ఇప్పుడు అమెరికా అంగీకారం తెలపడం సంచల మలుపుగా మారింది.
భారత్కు బైడెన్ భరోసా..
వ్యాక్సిన్ పేటెంట్ హక్కుల రద్దు ప్రతిపాదనకు మద్దతు పలికిన అమెరికా.. భారత్ కు సహాయంపైనా స్పందించింది. కరోనా సెకండ్వేవ్ను ఎదుర్కొంటున్న భారత్కు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని, వైద్య సామగ్రిని పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. మంగళవారం వైట్హౌస్ లో మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడానని, కోరిన సాయాన్ని చేస్తున్నామని, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రిని భారత్కు అందజేశామని బైడెన్ పేర్కొన్నారు. మరోవైపు ఆరు విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సామగ్రిని 'యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్' భారత్కు పంపిస్తున్నది. కాగా,
Recommended Video
సగం మందికి వ్యాక్సిన్లు దక్కవు..
కొవిడ్ వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కులు గనుక రద్దు చేయకుంటే ప్రపంచంలో సంగం మందికి వ్యాక్సిన్లు దొరకని లేదా అధిక ధరకు కొనసాల్సిన దుస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. ప్రపంచ జనాభాలో 70% మందికి కరోనా టీకా (రెండు డోసులు) వేయడానికి 1,100 కోట్ల డోసులు అవసరమవుయని అంచనా. ఇప్పటివరకూ ఉత్పత్తి సంస్థలతో వివిధ దేశాలు 860 కోట్ల డోసులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో మెజార్టీ అంటే, 600 కోట్ల డోసులను ధనిక, ఎగువ మధ్య తరగతి దేశాలు ఆర్డర్లు పెట్టాయి. ఈ దేశాల్లో జనాభా 100 కోట్లు కూడా దాటదు. అంటే అవసరానికి మించి మూడురెట్లు ఎక్కువ టీకాలను ఆ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. అలాంటప్పుడు 80% జనాభా (18 ఏండ్లు పైబడినవాళ్లు 450 కోట్లు) ఉన్న పేద, మధ్య తరగతి దేశాలకు 240 కోట్ల డోసులే మిగులుతాయి. ఈ దేశాల్లో కేవలం 120 కోట్ల మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకాను (రెండు డోసులు) వేయవచ్చు. మిగిలిన 330 కోట్ల మంది టీకాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుంది. అలా జరగొద్దంటే, ఎక్కడికక్కడ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరగాలి. వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కులు లేకుండా ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఆ దిశగా భారత్ ప్రయత్నాలకు అమెరికా మద్దతు పలకడం శుభసూచికమే అయినా, ఎంత కాలంలోగా అధి సాధ్యమవుతుందో వేచి చూడాలి..