యూపీలో కుల రాజకీయాలు: ఓబీసీ నేతలకు అఖిలేష్ వల: బీజేపీకి కష్టకాలమేనా..?
2017లో ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వన్సైడెడ్గా జరిగాయనే చెప్పొచ్చు. అప్పటి అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీని కూలదోసి ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. అయితే ఇక్కడ చాలా అంశాలు ప్రభావితం చేశాయి. హిందుత్వ అజెండా 2017 ఎన్నికలను ప్రభావితం చేసింది. అయితే 2022లో కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందా.. బీజేపీకి కలిసొస్తుందా.. అంటే ఇప్పుడే దీన్ని అంచనా వేయడం తొందరపాటు చర్యే అవుతుంది. ఇక తాజాగా వెనకబడిన తరగతులు ఓబీసీలు ఈ సారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీజేపీకి గుడ్బై చెప్పిన స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహన్లు సమాజ్ వాదీ పార్టీ కండువా కప్పుకోవడంతో యూపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఈ పార్టీ చేతికి అస్త్రం అందించినట్లయ్యింది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో స్వామి ప్రసాద్ మౌర్య కీలక పాత్ర పోషిస్తారు. కుల రాజకీయాలు చేయడంలో ఈయన దిట్ట అని చెబుతుంటారు. మాయావతి పార్టీ బీఎస్పీలో సుదీర్ఘంగా కొనసాగిన మౌర్య 2017 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. బీజేపీ ఘనవిజయం సాధించడంతో స్వామి ప్రసాద్ మౌర్యను సీఎం యోగీ తన కేబినెట్లో చోటు కల్పించారు. యోగీతో మరీ అంత మంచి సంబంధాలు కొనసాగించకపోయినప్పటికీ... బీజేపీ పట్ల మాత్రం స్వామిభక్తితో మెలిగాడు. రాష్ట్రంలో మూడవ అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న మౌర్య సామాజికవర్గానికి చెందిన నేత స్వామి ప్రసాద్ మౌర్య. మొత్తం జనాభాలో 8శాతం జనాభా మౌర్య సామాజిక వర్గంగా ఉంది. ఇక ఈయన ఖుషినగర్ జిల్లా పద్రౌనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈయన సామాజిక వర్గం రాయబరేలీ, ఉంచహార్, షాజహాన్పూర్ మరియు బదయూ జిల్లాల్లో ఉండటంతో కీలక నేతగా యూపీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. యూపీలో 403 అసెంబ్లీ స్థానాల్లో 100కు పైగా స్థానాల్లో మౌర్యా సామాజిక వర్గం ఓటర్లు బాగానే ఉన్నారు. ఈ సామాజిక వర్గం వారు సీట్ల బేరం సందర్భంగా మహాదల్ పేరుతో సొంత పార్టీని కూడా స్థాపించారు. దీంతో అఖిలేష్ యాదవ్ తన ప్రచారం ప్రారంభించడానికి ముందే ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం విశేషం.
ఇక స్వామి ప్రసాద్ మౌర్య దారిలోనే గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు మరో ఓబీసీ నేత దారాసింగ్ చౌహాన్. ఈయన నోనియా సామాజిక వర్గానికి చెందిన నేత. తూర్పు ఉత్తర్ప్రదేశ్ జిల్లాల్లో ఈ సామాజిక వర్గానికి ఒక్కింత పట్టు ఉంది. తూర్పు ఉత్తర్ ప్రదేశ్ జిల్లాల్లో 3శాతం మేర ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.వారణాసి, చండౌలీ, మీర్జాపూర్లలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ సామాజిక వర్గంకు చెందిన పృథ్విరాజ్ జన్ శక్తి పార్టీతో బీజేపీకి పొత్తు ఉంది. ఈ సామాజిక వర్గంలో బలమైన నేతగా దారాసింగ్ చౌహాన్ ఉన్నారు. ఇక రాజ్భార్ అనే మరో సామాజిక వర్గం ఉత్తర్ ప్రదేశ్లో బలంగా ఉంది. తూర్పు ఉత్తర్ ప్రదేశ్లో 15 శాతం నుంచి 20శాతం వరకు ఈ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారు. కులాలు ఉపకులాలు చాలా వరకు ఓట్లను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇక్కడి రాజకీయ పార్టీలు నేతలు ఏ ఒక్క కులాన్ని విస్మరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓమ్ ప్రకాష్ రాజ్భర్ కీలక నేతగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. ఈయన పార్టీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక యోగీ కేబినెట్లో ఓంప్రకాష్ రాజ్భర్కు చోటు దక్కింది. మూడు నెలల క్రితమే అఖిలేష్ పార్టీలోకి ఈ నేత వెళ్లారు.
ఇక ఉత్తర్ ప్రదేశ్లాంటి రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్న సామాజిక వర్గాల వారు కూడా సొంత పార్టీలు పెట్టుకుంటున్నారు. దీంతో బడా పార్టీలతో ఈ చిన్న సామాజిక వర్గాల వారు మంచి డీల్ కోసం ఎదురుచూస్తుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2014లో కీలక పాత్ర పోషిస్తోన్న సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. హిందుత్వా అజెండాతో ముందుకొచ్చిన బీజేపీకి ఈ చిన్న పార్టీలు మద్దతు తెలిపాయి. తమకు మంచి గుర్తింపుతో పాటు తమ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తాయని భావించాయి. కానీ మూడు ఎన్నికలు ముగిశాక కూడా వీరికి తగిన ప్రాధాన్యత బీజేపీ ఇవ్వకపోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ఈ నాయకులు. 2017లో అఖిలేష్ యాదవ్ తమ పార్టీ కేవలం ముస్లిం-యాదవ్ సామాజిక వర్గాలకు చెందినదే అనే మార్కును తొలగించడంలో విఫలమయ్యాడు. అయితే ఈ సారి మాత్రం అఖిలేష్ యాదవ్ పావులు చాలా వ్యూహాత్మకంగా కదుపుతున్నారు. ప్రస్తుతం వీరంతా యోగీపై నమ్మకాన్ని కోల్పోయారు. దీంతో మోడీ-షా ద్వయం యోగీని నమ్ముకుంటే ఓబీసీ ఓటు బ్యాంకును తిరిగి బీజేపీ వైపు తిప్పుకోలేమనే భావనకు వచ్చేసి యోగీని మార్చేద్దామనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేశారు. కానీ యోగీ ఆదిత్యనాథ్కు ఆర్ఎస్ఎస్ నుంచి బలమైన మద్దతు ఉండటంతో ఆయన్ను తొలగించడంలో విఫలమయ్యారు.
మొత్తానికి కుల రాజకీయాలే ఎక్కువగా కనిపించే ఉత్తర్ప్రదేశ్లో ఈ సారి ఎన్నికలు ఎలాంటి సవాలు విసురుతుందో వేచి చూడక తప్పదు.