యూపీ ఎన్నికలలో మహాకూటమి: అఖిలేష్
పాట్నా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగాలని ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ భావిస్తుంది. 2017లో జరిగే ఎన్నికలోల మహాకూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అంటున్నారు.
2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీలతో పొత్తు ఉంటుంది అనే విషయం చెప్పడానికి అఖిలేష్ యాదవ్ నిరాకరించారు. ముందు ముందు మీకే తెలుస్తుందిలే అంటూ మీడియాతో అన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ మంత్రి ఫరీద్ మహపూజ్ కిద్వాయ్ మాత్రం వేరే విధంగా అన్నారు.
సమాజ్ వాదీ-బీఎస్పీల మద్య పొత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తేభగ్గుమంటుంది కదా మీరెలా పొత్తు పెట్టుకుంటారని మీడియా ప్రశ్నించగా బీహార్ లో ఇప్పుడు ఏమి జరిగింది అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.
బీహార్ లో జేడీయూ- అర్జేడీలు గతంలో ఇలాగే ఉన్నాయని, అయితే మహాకూటమి ఏర్పాటు చేసి వారు అధికారంలోకి వచ్చారు కదా అని గుర్తు చేశారు. యూపీ పంచాయితీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీని ప్రజలు ఆదరించారని అఖిలేష్ యాదవ్ అంటున్నారు.
ప్రజలు అభివృద్దిని చూసి ఓట్లు వేస్తారని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం బీహార్ లో సైతం అభివృద్దిని చూసి ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అభివృద్ది ఎజెండాతోనే తాము పోటీకి దిగుతామని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.