యూపీ పోరు క్లియర్--యోగీ వర్సెస్ అఖిలేష్- మాయా మౌనం-కాంగ్రెస్ కు లాభం
యూపీ అసెంబ్లీ ఎన్నికల పోరుపై క్లారిటీ వచ్చేసింది. గతంలో ఎన్నోసార్లు బహుముఖ పోరు జరిగిన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో ఈసారి మాత్రం ద్విముఖ పోరు తప్పేలా లేదు. అదీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూ కావడం ఇక్కడ విశేషం. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీపై ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో అఖిలేష్ చూపిస్తున్న దూకుడు, బీఎస్పీ అధినేత్రి మాయావతి మౌనం ఈాసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి.
ఆసక్తికరంగా యూపీ పోరు
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఏడు దశల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి చావో రేవోగా మారిపోయాయి. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ పోరులో తప్పక గెలిచి తీరాల్సిన ఒత్తిడంతా బీజేపీపైనే ఉంది. అసలే యోగీ సర్కార్ పై పెరిగిన ప్రజా వ్యతిరేకత, లఖీంపూర్ ఖేరీ వంటి ఘటనలు, ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యాలు అన్నీ కలగలిసి ఇప్పుడు బీజేపీకి అక్కడ చుక్కలు చూపిస్తున్నాయి.
సరిగ్గా ఇవే అంశాన్ని క్యాష్ చేసుకంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వేస్తున్న అడుగులు సీఎం యోగీతో పాటు బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. వీరిద్దరి మధ్య పోరులోకి చొరబడేందుకు కాంగ్రెస్, బీఎస్పీ వంటి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు పట్టు చిక్కడం లేదు. దీంతో యూపీ రాజకీయం ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా మారిపోయింది.
యోగీ వర్సెస్ అఖిలేష్
యూపీ ఎన్నికల్లో యోగీ సర్కార్ వైఫల్యాలపై అఖిలేష్ మొదలుపెట్టిన పోరు మిగతా విపక్షాలకు అందనంత దూరంలో ఉంది. ముఖ్యంగా గతంలో సొంతంగా అధికారంలోకి వచ్చిన చరిత్ర కలిగిన బీఎస్పీ మౌనంగా ఉండిపోవడం, కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలు కూడా ఆశించినంత దూకుడు ప్రదర్శించలేకపోవడం, యోగీని ఎదుర్కోనే సత్తా ఉన్న నాయకుడిగా అఖిలేష్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
కేంద్రం ఎన్ని రకాలుగా టార్గెట్ చేస్తున్నా అఖిలేష్ మాత్రం లొంగడం లేదు. నేరుగా అవినీతి ఆరోపణలు లేకపోవడం, పార్టీపై పూర్తి పట్టు కలిగి ఉండటం అఖిలేష్ కు కలిసొస్తున్నాయి. దీంతో యోగీతో ముఖాముఖీ పోరుకు అఖిలేష్ సై అంటే సై అంటున్నారు.
మాయావతి మౌనం
యూపీలో ఒకప్పుడు దళితుల్ని, బ్రహ్మణుల్ని ఏకం చేసి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చాలా రాజకీయ పార్టీలకు పాఠాలు నేర్పిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈసారి పూర్తిగా సైలెంట్ అయిపోతున్నారు. తన బంధువులపై ఈడీ దాడులు, ఇతరత్రా కారణాలతో మాయావతి రాజకీయంగా యాక్టివ్ గా కనిపించడం లేదు. దీంతో బీఎస్పీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీని వీడి ఎస్పీలో చేరిపోతున్నారు.
అయినా మాయావతి స్పందించడం లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం మినహా క్షేత్రస్ధాయిలో ప్రచారం కానీ, పోరాటాలు కానీ చేసేందుకు మాయ సిద్ధంగా లేరు. దీంతో ఈసారి మాయావతిని పోల్ సర్వేల్లో సైతం సర్వే సంస్ధలు పట్టించుకోవడం లేదు. అయితే ఈ మౌనం ఎవరికి లాభిస్తుందన్న చర్చ మాత్రం కొనసాగుతోంది.
ఎస్పీ, కాంగ్రెస్ కు మాయా దళిత ఓట్లు
మాయావతి పార్టీ బీఎస్పీకి ఇన్నాళ్లు అండగా ఉన్న దళితులు.. ఇప్పుడు ఆమె మౌనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరు నచ్చక కాంగ్రెస్, ఎస్పీల్లో చేరిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు బీజేపీకి కూడా జై కొడుతున్నారు. దీంతో మాయావతి దళిత ఓటు బ్యాంకు కాస్తా మూడు పార్టీల మధ్య చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలితే మాత్రం వీరంతా గంపగుత్తగా అఖిలేష్ కు అండగా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన అంబేద్కర్ వాదులు, బీసీల ఓట్లనే టార్గెట్ చేస్తున్నారు. అయినా మాయా మాత్రం ఇవేవీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.