యోగి ప్రభుత్వంలో చిచ్చు: సీనియర్లు భగ్గు: దళిత మంత్రి రాజీనామా: అమిత్ షా వద్ద పంచాయితీ
లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఉత్తర ప్రదేశ్లో ఏర్పాటైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. యోగి ఆదిత్యనాథ్ పనితీరు పట్ల సీనియర్లల్లో అసంతృప్తి తలెత్తింది. మంత్రివర్గంలో విభేదాలు తలెత్తాయి. రాజీనామాలకు దారి తీశాయి. ఓ సీనియర్ మంత్రి తన పదవికి గుడ్బై చెప్పేశారు కూడా. మరొకరు అదే దారిలో ఉన్నారు. రాజీనామా చేయడానికి సమాయాత్తం అయ్యారు.
అమిత్ షా వద్దే పంచాయితీ..
బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వద్దే తేల్చుకోవడానికి సిద్ధం అయ్యారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర ప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు హస్తినకు బయలుదేరి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలపై బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తోంది. అసంతృప్తిని చల్లార్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది. బుజ్జగింపులు సైతం మొదలు పెట్టింది.
యోగి పనితీరుపై..
యోగి ఆదిత్యనాథ్ పని తీరు, అన్ని శాఖలపై ఆయన పెత్తనం చలాయించడానికి ప్రయత్నాలు సాగిస్తోండటం, తమ శాఖల బదిలీల విషయాల్లోనూ ముఖ్యమంత్రి కార్యాలయ స్థాయి అధికారులు జోక్యం చేసుకోవడం వంటి కారణాల వల్ల సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ వార్తలు వెల్లువెత్తుతోన్నాయి. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత యోగి ఆదిత్యనాథ్ పనితీరులో అనేక మార్పులు సంభవించాయనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి.
మంత్రి రాజీనామా..
తాజాగా- జల్శక్తి శాఖ సహాయమంత్రి, ప్రముఖ దళిత నాయకుడు దినేష్ ఖటిక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బదులుగా ఆయన అమిత్ షానకు పంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజీనామా లేఖలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు చెబుతున్నారు. పదవికి గుడ్బై చెప్పడానికి గల కారణాలను క్షుణ్నంగా వివరించినట్లు సమాచారం. అంశాలవారీగా లోపాలను ప్రస్తావించారని అంటున్నారు.
అమిత్ షాకు రాజీనామా లేఖ..
దినేష్ ఖటిక్ రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మీరట్లోని హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, సమాజ్వాది పార్టీకి చెందిన యోగేశ్ వర్మను ఏడువేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్. జల్శక్తి శాఖ కేబినెట్ హోదా మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్పై ఈ లేఖలో కీలక ఆరోపణలు చేశారనే ప్రచారం ఉంది.
జితిన్ ప్రసాద కూడా..
స్వతంత్ర దేవ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా. మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని చెబుతున్నారు. ఈ వ్యవహారం మొత్తంపైనా బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. అసంతృప్త నాయకులను ఢిల్లీకి పిలిపించుకునే అవకాశాలు లేకపోలేదు.