ప్రజలను ఏమార్చే ఎత్తుగడ: బీజేపీ రామ మందిరం ఏజెండాపై విపక్షాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అందుకోసమే ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 'రామ మందిరం' ఎజెండాను తీసుకొచ్చిందని బిఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానాలు అమలుచేయలేని 'కమలం' పార్టీకి మరోసారి 'ప్రతిజ్నాపత్రం' తెచ్చే నైతిక హక్కే లేదని స్పష్టంచేశారు.
లక్నో: వేలాది మంది అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించినంత స్థాయిలోనే విపక్షాలు మండిపడ్డాయి. ఇది ప్రజలను ఏమార్చేందుకేనని బీఎస్పీ చీఫ్ మాయావతి వ్యాఖ్యానించారు. ఇది అబద్దాల పుట్ట అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) అధ్యక్షుడు రాజ్ బబ్బర్ అభివర్ణించారు. యూపీలోని అధికార సమాజ్వాదీ పార్టీ సైతం తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడేళ్లుగా వాటిని అమలు చేయకపోగా కాషాయ పార్టీ బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తోందని మండిపడింది.

బీజేపీకి ఆ నైతిక హక్కే లేదు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మరోసారి ఏమార్చి తప్పుదోవ పట్టించేందుకు బిజెపి రామ మందిరం నిర్మిస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిందని మాయావతి వ్యాఖ్యానించారు. గత హామీలు అమలు చేయలేకపోయిన బీజేపీకి ప్రతిజ్నా పత్రం జారీచేసే నైతిక హక్కే లేదని ఆరోపించారు. ‘అచ్ఛేదిన్' తీసుకు వస్తామని వాగ్దానంచేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ నినాదం అమలులో విఫలమైందని అన్నారు. నాటి వాగ్దానాన్ని అమలు చేయడంలో విపలమైన బిజెపికి ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ప్రజలకు తీపి కబుర్లు చెప్పి ప్రధానిగా అధికారంలోకి వచ్చి, గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.

తప్పులను కప్పిపుచ్చుకునేందుకే..
అధికారంలోకి వస్తే రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం అబద్ధాల పుట్ట అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పేర్కొన్నారు. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బిజెపి మ్యానిఫెస్టోలో వాగ్దానాల వరద కురిపించిందని ఓ ప్రకటనలో తెలిపారు. బిజెపి ఎన్నికల ప్రణాళిక గురించి రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నదని.. బీజేపీ తనను కూడా మోసగిస్తుందని రాముడికి కూడా తెలుసునని అని చెప్పారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనింగ్ మాఫియా సంగతేంటి?
రాష్ట్రంలో ఎంతమంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించనే లేదని కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ అన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా నియంత్రణకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అమిత్ షా.. తన సొంత పార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న మాఫియా నియంత్రణ సంగతేమిటని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రకటించిన తప్పుడు, అబద్దాల పత్రం అని రాజ్ బబ్బర్ వ్యాఖ్యానించారు.
మా మ్యానిఫెస్టోనే కాపీకొట్టిన బిజెపి: ఎస్పీ
తాము ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను కాపీ కొట్టిందని సమాజ్ వాదీపార్టీ ఆరోపించింది. లోక కల్యాణ్ సంకల్ప్ పత్రం పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇటువంటి హామీలతో మ్యానిఫెస్టో ప్రకటించిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ అన్నారు.. ప్రతిభావంతులైన విద్యార్థులకు తాము ప్రకటించిన తర్వాతే ఉచితంగా ల్యాప్ టాప్ కంప్యూటర్లు, పోలీసుశాఖలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని బీజేపీ హామీనిచ్చిందని ఎస్పీ వ్యాఖ్యానించారు. రైతుల పంట రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన బీజేపీ.. నోట్ల రద్దుతో అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. యూపీ పౌరులు ఇంతటి భారీ కలలు కనడం లేదన్నారు.ఇటువంటి మోసపూరిత హామీలను ప్రజలు నమ్మబోరని ఆయన స్పష్టంచేశారు.

లా అండ్ ఆర్డర్ లక్ష్యంగా అఖిలేశ్పై దాడికి బీజేపీ వ్యూహం
అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల పరిరక్షణ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని బీజేపీ భావిస్తున్నది. కైరానా వలసలు, తొలిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో రాజకీయ పునరేకీకరణ లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతున్నది. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఎస్పీ ప్రకటించిన మ్యానిఫెస్టోతో సమానంగానే బీజేపీ కూడా హామీలు కుప్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా ఎన్నికల ఫలితాలను సంక్లిష్టం చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం వరకు 2014 ఎన్నికల ప్రణాళిక తరహాలోనే ప్రజలకు మ్యానిఫెస్టో ప్రకటించడానికి సిద్ధమైంది. బులంద్షేర్ అత్యాచారం కేసును ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాలని కూడా కమలనాథులు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రయిక్స్, నోట్ల రద్దు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓట్లడుగుతున్న బీజేపీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భిన్నంగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications