కర్ణాటక కేడర్ ఐఎఎస్ అధికారి తివారీ మరణం వెనుక ఉన్న మిస్టరీ, ఏం జరిగింది?
నాలుగు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో అనుమానాస్పదస్థితిలో కర్ణాటకకు కేడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి అనురాగ్ తివరా మరణించారు.
బెంగుళూరు: నాలుగు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో అనుమానాస్పదస్థితిలో కర్ణాటకకు కేడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి అనురాగ్ తివరా మరణించారు. ఈ ఘటనపై యూపి సిట్ విచారణను ప్రారంభించింది.
ఈ బృందం విచారణ కోసం కర్ణాటకకు రానుంది. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుభాస్ చంద్ర కుంటియాతో భేటీ కానుంది.
ఆయన నుంచి సమాచారాన్ని సేకరించిన అనంతరం ఆహార పౌరసరఫరాల శాఖ సిబ్బందిని కూడ విచారించి సమాచారాన్ని సేకరించనున్నారు.2007 బ్యాచ్ రాష్ట్ర కేడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి అనురాగ్ తివారి ఈ నెల 17న, లక్నోలో రోడ్డుపై అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఈ ఘటన సహజ మరణం కాదని ఎవరో హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వారంతా పేర్లు బయటకు చెప్పకుండా కర్ణాటకకు చెందిన కొంతమంది అధికారులు, మంత్రులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తివారి తమ్ముడైన మయూంక్ తివారి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటకలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా పనిచేసే సమయంలో దాదాపుగా 2 వేల కోట్ల రూపాయాల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. వాటిని ప్రధాని నరేంద్రమోడీతో పాటు సిబిఐ కి కూడ పంపించాలని భావించారు.
దీంతో ఆయనపై సీనియర్ అధికారుల ద్వారా మంత్రులు ఒత్తిళ్ళు తీసుకువచ్చారు. తివారీ ఈ విషయాన్ని తనకు చెప్పడమే కాకుండా ఆ వివరాలు వాట్సాప్ లో పంపించారని ఆయన బహిరంగంగా ప్రకటించారు.ఆధారాలను సైతం అక్కడి అధికారులకు అందజేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇక్కడికిరానుంది.
అనురాగ్ తివారి కర్ణాటకలో ఆహారశాఖ కమిషనర్ గా పనిచేసే సమయంలో ఆయన పనితీరు సిబ్బందితో వ్యవహరించిన తీరు సీనియర్ అధికారుల ప్రవర్తన తదితర విషయాలపై సమాచారం సేకరించనున్నట్టు సమాచారం.
తివారి అనుమానాస్పద స్థితి మృతిపట్ల సమగ్ర దర్యాప్తు జరిపించాలని ,ఇందుకు పూర్తి సహకారం అందించనున్నట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. ఇక బిజెపి రాష్ట్ర శాఖ కూడ సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేసింది.అయితే కుటుంబ కలహాలతో తివారీ కొంతకాలంగా మానసికంగా కలత చెందినట్టు వాదన కూడ విన్పిస్తోంది. భార్యతో విడాకులు తీసుకొన్నారు.