హైకోర్టును తరలించాలని తీర్మానం చేసిన ఆ మంత్రివర్గం..!!
డెహ్రాడూన్: ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సారథ్యంలో ఉత్తరాఖండ్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. లవ్ జిహాద్పై వేటు వేసింది. దీనికి సంబంధించిన కార్యకలాపాలన్నింటిపైనా నిషేధాన్ని విధించింది. ప్రేమ పేరుతో ఇతర మతస్తులను పెళ్లాడటాన్ని తీవ్రంగా పరిగణించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఇటీవలే వెలుగులోకి వచ్చిన శ్రద్ధ హత్యోదంతంతో పాటు అలాంటి ఘటనలే పెద్ద ఎత్తున చోటు చేసుకుంటోన్నందున ఈ నిర్ణయానికి వచ్చింది.
ప్రత్యర్థి అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేసిన బీజేపీ..!!
ఇటీవలే వెలుగులోకి వచ్చిన శ్రద్ధా వాల్కర్ హత్యోదంతం దేశం మొత్తాన్నీ కదలించిన విషయం తెలిసిందే. ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా చేతుల్లో దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన ఆఫ్తాబ్..శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచాడు. రోజుకో శరీర భాగం చొప్పున వేర్వేరు చోట్ల విసిరేశాడు. శ్రద్ధ శరీర భాగాలు ఫ్రిడ్జ్లో ఉండగానే మరో యువతితో డేటింగ్ మొదలుపెట్టాడు. ఆమెను తన అపార్ట్మెంట్కు పిలుచుకొచ్చేవాడు. దీన్ని లవ్ జిహాద్గా పరిగణించారు పోలీసులు. ఈ కోణంలోదర్యాప్తు సాగిస్తోన్నారు.
ఈ నేపథ్యంలో- ఉత్తరాఖండ్ ప్రభుత్వం లవ్ జిహాద్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపింది. దీన్ని నిషేధించింది. ఎవరైనా గానీ లవ్ జిహాద్కు పాల్పడినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలను తీసుకోనుంది. పది సంవత్సరాల పాటు కారాగార శిక్షను విధించనుంది. అలాగే- మత మార్పిళ్లపైనా కన్నెర్ర చేసింది. మత మార్పిళ్లకు పాల్పడిన వారికి కూడా అదే శిక్ష వర్తింపజేసేలా పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన తీర్మానాలన్నింటినీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది.
కొద్దిసేపటి కిందటే పుష్కర్ సింగ్ ధామి సారథ్యంలోని ఉత్తరాఖండ్ మంత్రివర్గం సమావేశమైంది. 26 తీర్మానాలను ఆమోదించింది. ఇక మరో కీలకమైన తీర్మానం- హైకోర్టు తరలింపు. ప్రస్తుతం నైనిటాల్లో కొనసాగుతోన్న రాష్ట్ర హైకోర్టును హల్వానీకి తరలించేలా రూపొందించేలా తీర్మానంపై కూడా ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పలు తీర్మానాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.