భారత్ను అమెరికా 200ఏళ్లు పాలించింది -మోదీ వల్లే గెలిచాం -20మంది పిల్లల్ని కనొచ్చుగా: ఉత్తరాఖండ్ సీఎం మళ్లీ
వింత కామెంట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ ముఖ్యమంత్రులు తమతో తామే పోటీపడుతున్నారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ వాడకం మొదలు శ్రీలంక, నేపాల్ దేశాల్లోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామనేదాకా త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ వరుసగా వార్తల్లో నిలవగా, ఇప్పుడాయనకు ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ గట్టిపోటీ ఇస్తున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన కామెంట్ల వివాదం సమసిపోకముదే తీరత్ మరోసారి వేసేశారిలా..
దీదీ.. మీ కాలుతో నా తలపై తన్నండి -బెంగాల్ ప్రచారంలో ప్రధాని మోదీ అనూహ్య వ్యాఖ్యలు
చిరిగిన జీన్స్ చల్లారకముందే..
ఆడవాళ్లు తమ మోకాళ్లు నగ్నంగా కనిపించేలా చిరిగిన(రిప్డ్) జీన్స్ ధరించడం వల్ల సమాజానికి ఏం సందేశమిస్తున్నారంటూ ఉత్తరాఖండ్ బీజేపీ సీఎం చేసిన కామెంట్లు పెనుదుమారం రేపడం, కోట్ల మంది మహిళలు ఆయపై ఎదురుదాడికి దిగడం, చివరికి సీఎం భార్య సైతం రంగంలోకి దిగి భర్తను వెనకేసుకురావడం తెలిసిందే. ఆ వివాదం చల్లారకముందే మళ్లీ అదే ముఖ్యమంత్రివర్యులు తాజాగా మరోసారి తన జ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఈసారి కరోనాపై భారత్ పోరాటాన్ని, మనుషుల్లోని కుళ్లుమోతుతనాన్ని ఆయన వివరించారిలా..
భారత్ను పాలించిన అమెరికా
అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం నైనిటాల్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ మాట్లాడారు. ప్రసంగం మధ్యలో కొవిడ్ పరిస్థితులను ప్రస్తావించారు. మహమ్మారిపై పోరాటంలో ఇతర దేశాలకు, మనకు ఉన్న తేడాను వివరించే ప్రయత్నం చేశారు. ''భారతదేశాన్ని 200 ఏళ్లపాటు పరిపాలించిన అమెరికా.. భారతీయయుల్ని 200 ఏళ్లు బానిసల్ని చేసి ఆధిపత్యం చెలాయించిన అదే అమెరికా.. రవి అస్తమించని రాజ్యంగానూ పేరుపొందిన ఆ దేశం ఇవాళ కొవిడ్ ను ఎదుర్కోలేక చేతులెత్తేసింది'' అని రావత్ వ్యాఖ్యానించారు.
నిజానికి ఆయనది పొరపాటే అయినప్పటికీ, ట్రాక్ రికార్డు కారణంగా ఇదీ వివాదాస్పదమైంది. ఒక ముఖ్యమంత్రికి బ్రిటన్కు అమెరికాకు తేడా తెలియకుండా మాట్లాడటం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని సమర్థించేలా అదే మీటింగ్ లో రావత్ ఇంకొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు..
తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!
మోదీ లేకుంటే అంతా ఆగం..
భారత్ ను అమెరికా 200 ఏళ్లు పాలించిందన్న ఉత్తరాఖండ్ సీఎం అతటితో ఆగకుండా, ప్రధాని మోదీని పొగిడేస్తూ.. ''ప్రపంచ దేశాలతో చూసుకుంటే కోవిడ్ మహమ్మారిని ఇండియా సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంతో దేశం కోవిడ్తో పోరాడి గెలిచింది. మోదీ కాకుండా ఈ దేశానికి మరెవరైనా ప్రధాని అయ్యుంటే ఈ దేశం పరిస్థితి ఏమయ్యేదో. తప్పకుండా చాలా దారుణమైన పరిస్థితులు వచ్చేవి'' అని తీరత్ సెలవిచ్చారు. నాటకీయ పరిణామాల మధ్య త్రివేంద్ర సింగ్ నుంచి రెండు వారాల కిందటే సీఎం సీటు పొందిన తీరత్ సింగ్ రావత్.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే మోదీని రాముడితో పోల్చుతూ, ఆయనను జనం భగవంతుడిలా ఆరాధిస్తారనడం తెలసిందే. ఇక చివరిగా..
20 మంది పిల్లల్ని కనొచ్చుగా
అటవీ దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలో కొవిడ్ సంబంధిత అంశాలను ప్రస్తావించిన ఉత్తరాఖండ్ సీఎం.. లాక్ డౌన్ అనంతరం ప్రజల్లో కుళ్లుమోతుతనం పెరిగిందని సూత్రీకరించారు. ''కరోనా వల్ల జనం గతంలో ఎన్నడూ పొందనంత నాణ్యమైన రేషన్ సరుకుల్ని పొందుతున్నారు. మనిషికి ఐదు కేజీల చొప్పున సరుకులు ఇస్తున్నాం. ఇద్దరు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీలు దక్కుతోంది. అదే 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటా సరుకులు లభిస్తున్నాయి. దీంతో ఎక్కువ సరుకులు పొందుతోన్నవారిపై చిన్నకుటుంబాల వాళ్లు అసూయతో రగిలిపోతున్నారు. దీనికి మనం మాత్రం ఏం చేయగలం? మీరు ఇద్దరు పిల్లల్నే కని ఆపేశారు, 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదు?'' అని సీఎం తీరత్ రావత్ వ్యాఖ్యానించారు.