ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీ గూటికి పార్టీ మాజీ చీఫ్ కిషోర్ ఉపాధ్యాయ్
ఉత్తరాఖండ్లో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఆపార్టీ మాజీ చీఫ్ కిషోర్ ఉపాధ్యాయ్ను అధిష్టానం బహిష్కరించింది. పార్టీలో వ్యతిరేక కార్యకలాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో కిషోర్పై ఆరేళ్లు బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఒక్క సారిగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయయి. కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిన కొన్ని గంటల్లోనే కిషోర్ ఉపాధ్యాయ్ కమల దళంలో చేరిపోయారు.
Recommended Video
బీజేపీలో చేరిన కిషోర్ ఉపాధ్యాయ్
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ కిషోర్ ఉపాధ్యాయ్ బీజేపీలో చేరారు. డెహ్రాడూన్ లో జరిగిన ఈకార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఉత్తరాఖండ్ను అభివృద్ధివైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తాను బీజేపీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవారికి గుర్తింపు లేదని మండిపడ్డారు. బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ బహిష్కరణ వేటు.
పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతోనే కిషోర్ ఉపాధ్యాయ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలిగించినట్లు పేర్కొంది. పలు సార్లు హెచ్చరించినప్పటికీ తన ప్రవర్తనలో మార్పురాలేదని .. అందుకే బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని కిశోర్ ఉపాధ్యాయకు లేఖ ద్వారా తెలిపింది.
ఇటీవల కేంద్రమంత్రితో భేటీ
ఇటీవల కిషోర్ ఉపాధ్యాయ బీజేపీ నేతలను కలిసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. బీజేపీ ఉత్తరాఖండ్ ఎన్నికల ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. దీంతో అప్పుడే ఆయన పార్టీ మారుతున్నట్లు సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెహ్రీ అసెంబ్లీ స్థానం నుంచి కిషోర్ పోటీ.
తెహ్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషోర్ ఉపాధ్యాయ్ను ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ నిర్ణయించింది. 2002, 2007 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు తెహ్రీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ఈనేపథ్యంలో ఇక్కడ నుంచే ఆయనను బీజేపీ పోటీ చేయిస్తుంది. కాగా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ దేవందర్ యాదవ్కు హరీష్ రావత్కు మధ్య ఉన్న విభేదాలు పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ప్రభావం చూపుతాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.