ఉత్తరాఖండ్: నోట్ల రద్దు, ప్రభుత్వ కూల్చివేత ప్రధానాస్త్రాలు
పేరుకే చిన్న రాష్ట్రమైనా రసవత్తర రాజకీయాలకు కేంద్ర బిందువు ఉత్తరాఖండ్. సమున్నత హిమాలయాలు, నిరంతర గంగానది గలగలలతో దేవభూమిగా పేరొందిన ఈ రాష్ట్రంలో సమస్యలు తక్కువేనని చెప్పాలి.
డెహడ్రూన్: పేరుకే చిన్న రాష్ట్రమైనా రసవత్తర రాజకీయాలకు కేంద్ర బిందువు ఉత్తరాఖండ్. సమున్నత హిమాలయాలు, నిరంతర గంగానది గలగలలతో దేవభూమిగా పేరొందిన ఈ రాష్ట్రంలో సమస్యలు తక్కువేనని చెప్పాలి. అదే సమయంలో రాజకీయ నాయకుల వ్యక్తిత్వం, చతురత కీలక పాత్ర పోషించనున్నాయి.
వచ్చేనెల 15వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఏడాది ప్రారంభంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చివేసి, తెర వెనుక రాజకీయాలు నెరిపిన కేంద్రం.. దానికి నాయకత్వం వహిస్తున్న బిజెపి ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతిగా మారే సంకేతాలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించే లక్ష్యంతో గత నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నోట్ల రద్దుతో తలెత్తిన నగదు కొరత సామాన్యుల్లో కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను మూటగట్టుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
తాము చేపట్టిన అభివ్రుద్ధి కార్యక్రమాలపైనా నోట్ల రద్దు ప్రభావం చూపిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే ఈ రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కైవసంచేసుకునేందుకు బిజెపి ముఖాముఖీ తలపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బిఎస్పీ ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బిజెపి విజయావకాశాలను దెబ్బతీసే శక్తి సామర్థ్యం కలిగి ఉన్నది.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం సాగించిన ఉత్తరాఖండ్ క్రాంతిదళ్, సమాజ్వాదీ పార్టీ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రమే. గత ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం కూల్చివేతకు ప్రయత్నించిన బిజెపి పట్ల వ్యతిరేకత తమకు సానుభూతిగా మారి విజయ తీరాలకు చేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. మరీ ముఖ్యంగా అందరి వాడినన్న ముద్ర గల హరీశ్ రావత్ రాజకీయ భవితవ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికలివి. 52 శాతం మంది ఓటర్లు గల యువతే ఈ దఫా ఎన్నికలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇరు పార్టీల్లోనూ నిరసన స్వరాలు
ప్రధాన రాజకీయ పార్టీల్లో నేతలంతా 60 - 80 ఏళ్ల వయసున్న కురువృద్ధులు కావడంతోపాటు ఏ పార్టీ కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపిల్లోనూ ఆశావాహులకు టిక్కెట్లు లభించకపోవడంతో పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సామాగ్రి ధ్వంసంచేశారు. సీఎం హరీశ్ రావత్, పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ ఫొటోలు గల ఫ్లెక్సీలు చించేశారు. ఇక బిజెపిలో మాజీ సీఎంలు బీసీ ఖండూరీ, కోషియారి, విజయ్ బహుగుణ వంటి వారు సిఎం పదవి కోసం పోటీ పడుతున్నారు.
2013లో ఇదీ పరిస్థితి..
ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2013 జూన్లో సంభవించిన ప్రక్రుతి వైపరీత్యాలు దేశంలోకెల్లా అతిపెద్ద జాతీయ విపత్తుగా పరిణమించాయి. భారీ స్థాయిలో పోటెత్తిన వరదలకు తోడు కొండ చరియలు విరిగి పడటంతో భారీ నష్టం వాటిల్లింది. కేథర్నాథ్లోయలో 5000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోని దేవాలయాలను సందర్శించేందుకు వెళ్లిన వివిధ రాష్ట్రాల భక్తులు, పర్యాటకులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. పలువురి ఆచూకీ గల్లంతైంది. ఈ పరిస్థితుల్లోనే 2014 ప్రారంభంలో నాటి సిఎం విజయ్ బహుగుణ స్థానే హరీశ్ రావత్ సీఎంగా పగ్గాలు చేపట్టినా రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత సాధించడంలో మాత్రం విఫలమయ్యారు.
హరీశ్ రావత్ భవితవ్యం ఇలా..
గతేడాది ప్రథమార్థంలో రసవత్తర రాజకీయం చోటు చేసుకున్నది. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫిరాయింపులకు తెరతీసింది. మాజీ సిఎం విజయ్ బహుగుణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాసనసభ్యులు.. హరీశ్ రావత్ సర్కార్కు వ్యతిరేకంగా నిలిచారు. వారికి బీజేపీ బాసటగా నిలిచి అప్రతిష్ఠను మూట కట్టుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వ కూల్చివేసిన నరేంద్రమోడీ ప్రభుత్వం. రాష్ట్రపతి పాలన విధించింది. సుప్రీంకోర్టు జోక్యంతో తిరిగి ప్రజాస్వామ్య పునరుద్ధరణతో హరీశ్ రావత్ ప్రభుత్వం ప్రతిష్టించింది. ఈ దశలో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని బయటికి వచ్చిన వీడియో క్లిప్పింగ్లు హరీశ్ రావత్కు ఒకింత అపకీర్తి తెచ్చి పెట్టాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మేలో అసెంబ్లీ వేదికగా విశ్వాస తీర్మానంలో నెగ్గిన రావత్.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు పొందడం సవాలే. ఈ ఎన్నికలు హరీశ్ రావత్ రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. మిగతా వారికి భిన్నంగా హరీశ్ రావత్ సీఎం పదవిని అధిష్టించేందుకు 12 ఏళ్ల పాటు వేచి చూశారు.
యువ ఓటర్లే కీలకం..
ఎన్నికల్లో విజయంపై విశ్వాసంతోనే ఉన్న బిజెపి.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడుల తర్వాత తమ ప్రతిష్ఠ పెరిగిందని భావిస్తున్నది. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సైన్యంలో పనిచేయడం మరోసారి కమలం వికసించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కానీ గత నవంబర్ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గుముఖం పడుతూ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని తాజా సర్వేలు కూడా చెబుతున్నా, 52 శాతం యువత ఉన్న ఉత్తరాఖండ్ ఓటర్లు ఎలాంటి తీర్పు చెబుతారన్నది ఆసక్తికరం. పార్టీ ఇన్చార్జిలుగా ఉన్న కేంద్ర మంత్రులు జెపి నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా విస్త్రుత పర్యటనలు చేశారు. హరీశ్ రావత్ వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా అవినీతిపై ప్రచారం చేస్తున్నారు. కానీ హరీశ్ రావత్ ఈ ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్తున్నారు. రావత్ ను అడ్డుకునేందుకు బిజెపి.. కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలను పావుగా మార్చుకుంటున్నది. ప్రత్యేకించి విజయ్ బహుగుణ, మాజీ మంత్రులు హరాక్ సింగ్, కున్వర్ ప్రణబ్, సత్పాల్ మహరాజ్ వంటి వారితో ఎదురుదాడికి దిగారు.
బయటి వ్యక్తుల కమలనాథుల ఆగ్రహం
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బిజెపిలో నేతలు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్ల కోసం, సీఎం పీఠం కోసం భారీ పోటీ నెలకొంది. గత ఏడాది హస్తం పార్టీకి చేయి ఇచ్చి తమ పార్టీతో చేతులు కలిపిన తొమ్మిది మంది నేతలకు ఈసారి బీజేపీ టిక్కెట్లు ఇస్తే తిరుగుబాట్లు తప్పవని ఆ పార్టీ నేతలు పలువురు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. బీజేపీ గెలిస్తే సీఎం పీఠం కోసం ఐదుగురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. సీఎం రేసులో ఉన్న మాజీ సీఎంలు ఖండూరి, కోషియారి, నిశాంక్, బహుగుణలతోపాటు మహారాజా హరక్సింగ్ ఉన్నారు. దీంతో ఈ పరిస్థితి బీజేపీకి తలనొప్పిగా మారింది.
అందరివాడిగా...
ఇందుకు అధికార కాంగ్రెస్ పరిస్థితి పూర్తి భిన్నం. రాష్ట్రంలో అధిక ఓటర్లు ఉన్న రాజపుత్రుల సామాజిక వర్గ నేత. అందరికీ అందుబాటులో ఉంటాడనే పేరున్న హరీశ్ రావత కేంద్రంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. తాజాగా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ను డెహ్రాడూన్కు పంపింది. ఆరు నూరైనా ఉత్తరాఖండ్ను గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై సైన్యం లక్షిత దాడుల ఫలితంగా దేశ భక్తి సెంటిమెంట్ పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. కానీ తర్వాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదు కొరత సామాన్యుల్లో కేంద్రంలోని అధికార బిజెపి పట్ల వ్యతిరేకతను తెచ్చిపెట్టింది.
ఉత్తరాఖండ్ తొలి సిఎం..
కోటి మంది ప్రజలు సుదీర్ఘకాలం జరిపిన పోరాటం ఫలితంగా 2000లో ఉత్తరాఖండ్ ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైతే జరిగింది కానీ.. కాంగ్రెస్, బీజేపీల అధికార కుమ్ములాటల కారణంగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆ రాష్ట్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 70 స్థానాలున్న అసెంబ్లీకి 2002లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 36 స్థానాలు గెలుపొంది స్వల్ప మెజారిటీతో అధికారం దక్కించుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఎన్.డి.తివారీ తొలి సీఎం అయ్యారు. 2007లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్.. ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. భారీ వరదల తర్వాత పునర్నిర్మాణ కార్యక్రమాల్లో విఫలమైన విజయ్ బహుగుణను తప్పించి హరీశ్ రావతను సీఎంను చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు.