నీవు ఏం చేశావ్?: ప్రశ్నించిన యువకుడ్ని చితకబాదిన కాంగ్రెస్ ఎమ్మెల్యే(వీడియో)
ఛండీగఢ్: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. తాజాగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. ఓ యువకుడిని చితకబాదాడు. నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిందుకే అతడ్ని చావబాదడం గమనార్హం. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో సదరు ఎమ్మెల్యే జోగీందర్ పాల్పై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. పఠాన్కోట్లోని భోవా గ్రామంలో ప్రజలను ఉద్దేశించి జోగిందర్ ప్రసంగిస్తున్నారు. ఆ గ్రామంలో పర్యవేక్షించిన పనుల గురించి చెబుతున్నారు. ఈ సమయంలో అక్కడే గుంపులో ఉన్న ఓ యువకుడు పలు ప్రశ్నలు సంధించాడు. అయితే, సదరు ఎమ్మెల్యే పట్టించుకోలేదు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక పోలీసులు ఆ వ్యక్తిని బయటకు పంపే ప్రయత్నం చేశారు.
అయితే, ఆ యువకుడిని ఎమ్మెల్యే పిలుపించుకుని మైక్ ఇస్తాడు. దీంతో నువ్వు మాక్ ఏం చేశావ్? అంటూ సదరు ఎమ్మెల్యేను యువకుడు నిలదీస్తాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుని సహనం కోల్పోయి ఆ వ్యక్తిని చెంపపై కొట్టి ఆ తర్వాత చితకబాదుతాడు. ఎమ్మెల్యే చేయి చేసుకుంటే కార్యకర్తలు, నేతుల ఊరుకుంటారా? వారు కూడా యువకుడ్ని చావగొట్టారు. ఇది చాలదన్నట్లు అక్కడున్న పోలీసులు కూడా అతడ్ని చితకబాదడం గమనార్హం.
After Rahul Gandhi and Priyanka Vadra turned out journalists from their PCs for asking factual questions, it is turn of Joginder Singh, Congress MLA from Boha in Pathankot, to thrash a young man black and blue for just questioning him.
— Amit Malviya (@amitmalviya) October 20, 2021
This is the intolerant face of Congress. pic.twitter.com/pA8hiKNVjZ
యువకుడ్ని వారి బారి నుంచి కాపాడాల్సిన పోలీసులు కూడా చేయి చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత పోలీసులు అతడ్ని అక్కడ్నుంచి పంపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సదరు ఎమ్మెల్యేపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పంజాబ్ హోంమంత్రి సుఖ్ జిందర్ సింగ్ రంధ్వా స్పందించారు. ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేమంతా ప్రజలకు సేవ చేసేందుకు ఇక్కడ ఉన్నాం. మేం వారి ప్రతినిధులం అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, సదరు ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, నెటిజన్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అమరీందర్ సింగ్ విభేదాలుండగా, ఇప్పుడు తాజా సీఎం చరణ్ జిత్ సింగ్ తో కూడా సిద్దూకు పోసగడం లేదు. దీంతో చరణ్ జిత్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డట్లు వార్తలు వచ్చాయి.