హఫీజ్ సయీద్ను వైదిక్ కలవడం దేశద్రోహమే: ఉద్దవ్
ముంబై: సీనియర్ జర్నలిస్ట్ వేద్ ప్రతాప్ వైదిక్ వ్యవహారంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ పర్యటనలో ఉగ్రవాది హఫీజ్ సయీద్ను వైదిక్ కలవడం దేశద్రోహమని అన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం తన బాధ్యతను కాదనలేదని ఆయన అన్నారు. ఇదే అంశం కాంగ్రెస్ హయాంలో జరిగి ఉంటే భారతీయ జనతా పార్టీ ఎలా స్పందించేదని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు వేద్ ప్రతాప్ వైదిక్ను తక్షణం ప్రొసిక్యూట్ చెయ్యాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. కాగా, వేద్ప్రతాప్.. హఫీజ్ సయీద్ను కలుసుకున్న అంశం మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. హఫీజ్ సయీద్ను వేద్ ప్రతాప్ కలవడాన్ని తాము ఆమోదించడం లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం స్పష్టం చేశారు.
పాకిస్థాన్ పర్యటనలో భాగంగా ఉగ్రవాది హఫీజ్ సయీద్ను కలుసుకున్న వేద్ ప్రతాప్ అక్కడ ఒక పత్రికకు వివాదాస్పద ఇంటర్వ్యూ ఇచ్చారు. కాశ్మీర్కు స్వాతంత్య్రం ప్రకటించడమే సరైన మార్గమని ఆయన అన్నారు. అయితే ఈ విషయమై వేద్ప్రతాప్ మంగళవారం వివరణ ఇచ్చారు. కాశ్మీర్కు స్వాతంత్య్రం ఉండాలి కానీ కాశ్మీర్ విడిపోకూడదని అన్నారు.
కాశ్మీర్ను విడదీయడం మూర్ఖత్వం అవుతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో నాకు లభించినట్లుగా... లాహోర్లో మరో వ్యక్తికి లభించినట్లుగా... కాశ్మీర్ ప్రజలకు కూడా స్వాతంత్య్రం కావాలని అన్నట్లు వేద్ ప్రతాప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.