ఒక సాధారణ చెట్టు విలువ, 100 ఏళ్ల పురాతన వృక్షం విలువ ఎంతో తెలుసా... ఇదిగో లెక్క...
భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టు నియమించిన ఒక కమిటీ పురాతన వృక్షాల విలువను లెక్కగట్టింది. దేశంలో వృక్షాలకు సంబంధించిన విలువను అధికారికంగా నిర్దారించడం ఇదే మొదటిసారి. ఐదుగురు సభ్యులతో కూడిన ఆ కమిటీ తాజాగా సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించింది.
ఆ నివేదిక ప్రకారం.. ప్రతి చెట్టు ఒక ఏడాదికి దాదాపు రూ.74,500 విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఆ చెట్టు ద్వారా విడుదలయ్యే ఆక్సిజన్ విలువనే రూ.45వేలు ఉంటుంది. అలాగే బయోఫర్టిలైజర్స్ విలువ రూ.20వేలు ఉంటుంది. ఈ లెక్కన ఒక వందేళ్ల పురాతన వృక్షం విలువ రూ.74లక్షలు ఉంటుంది. అంటే,రోడ్లు,రైల్వే మార్గాలు,ఇతరత్రా ప్రాజెక్టుల పేరుతో దేశంలో భారీ ఎత్తున పురాతన వృక్షాలను తొలగిస్తుండటం తీవ్ర నష్టాన్ని కలగజేస్తోంది.
సేతు భారతం మెగా ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో దాదాపు 208 రైల్ బ్రిడ్జిల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకోసం రూ.20,800కోట్లు వెచ్చిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం భారీ పురాతన వృక్షాలను తొలగించాల్సి రావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఒక్క పశ్చిమ బెంగాల్లోనే దాదాపు 300 వృక్షాలను తొలగించాల్సి ఉంది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆ 300 వృక్షాల విలువను లెక్క గట్టేందుకు సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించింది.
ఆ కమిటీలో నిషికాంత్ ముఖర్జీ (టైగర్ ఎన్విరాన్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్), సోహమ్ పాండ్యా, (సెంటర్ ఫర్ సైన్స్ ఫర్ విలేజెస్ సెక్రటరీ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), సునీతా నరేన్ (డైరెక్టర్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్), బికాష్ కుమార్ మాజీ (అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్, ROB యూనిట్ , పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం),నిరంజిత మిత్రా (డివిజన్ అటవీ అధికారి, ఉత్తర 24 పరగణాలు) సభ్యులుగా ఉన్నారు.
సుప్రీం ఆదేశాల మేరకు ఒక ఏడాదికి ఒక వృక్ష విలువను రూ.74,500గా నిర్దారించి నివేదికను కోర్టుకు సమర్పించారు. మొత్తం 300 వృక్షాల విలువ రూ.220 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఒక పురాతన వృక్షాన్ని తొలగించాల్సి వస్తే ఆధునిక టెక్నాలజీ సాయంతో దాన్ని వేరే చోట పెట్టించాలని పేర్కొంది. అంతే తప్ప దాన్ని నరికివేసి మరో ఐదు కొత్త మొక్కలు పెట్టినంత మాత్రాన.. దాని విలువతో ఇవి సరిపోవని తెలిపింది.ఒక 59కి.మీ రహదారి నిర్మాణంలో దాదాపు 4056 వృక్షాలను తొలగించాల్సి వస్తుందని... వాటి విలువ రూ.3021కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఈ నివేదికపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు బెంగాల్ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరింది. ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.