జయ పార్టీ అలాగే: కమల్, రజనీలపై మొయిలీ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: సినీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెసు సీనియర్ నేత వీరప్ప మొయిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీకి తమిళనాడులో చోటు లేదని ఆయన అన్నారు.
ఒకప్పుడు వీరప్ప మొయిలీ తమిళనాడు కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరించారు. కమల్ హాసన్ పార్టీ పెద్దగా ఎదగడం సాధ్యం కాదని, చాలా తక్కువ మార్జిన్ మాత్రమే సాధిస్తుందని అన్నారు.
కమల్ హాసన్కు చోటు లేదని...
తమిళనాడులో డిఎంకె, అన్నాడియంకె పార్టీలు స్థానికంగా చాలా బలమైనవని, మరోవైపు రజనీకాంత్ స్వయంగా పార్టీ పెడుతానని ప్రకటించారని, ఈ స్థితిలో కమల్ హాసన్, రజనీకాంత్ ముందడుగు వేయాలంటే డిఎంకె లేదా అన్నాడియంకెతో కలిసి పనిచేయాల్సిందేనని వీరప్ప మొయిలీ అన్నారు
వారిద్దరికీ నష్టమే..
డిఎంకె, అన్నాడియంకెలతో సంబంధాలు పెట్టుకోకుండా కమల్ హాసన్, రజనీకాంత్ మనుగడ సాగించడం కష్టమని వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు తమిళనాడులోని చోటంతా ఆ రెండు పార్టీలే ఆక్రమించాయని అన్నారు. కమల్ హాసన్కు చోటు దక్కుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు.
కమల్ అంచనా తప్పే కావచ్చు...
బహుశా అన్నాడియంకె కుప్పకూలుతుందని, ఆ స్థానాన్ని తాను భర్తీ చేస్తాననీ కమల్ హాసన్ అనుకుంటూ ఉండవచ్చునని, అయితే అలా జరుగుతుందని తాను అనుకోవడం లేదని వీరప్ప మొయిలీ అన్నారు.
కమల్ హసన్ ఇలా చేస్తే...
డిఎంకె, అన్నాడియంకెలపై ఆధిపత్యం వహించే విధంగా కమల్ హాసన్ ప్రాంతీయ ఎజెండా ఉంటే మాత్రం చెప్పలేమని వీరప్ప మొయిలీ అన్నారు. డిఎంకెతో కాంగ్రెసు పార్టీకి బలమైన సంబంధం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని, ఇప్పటికైనా ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
అలా ఏం కాదు...
పార్లమెంటరీ పార్టీ నేతగా, యుపిఎ చైర్పర్సన్గా సోనియా గాంధీ కొనసాగుతూ రాహుల్ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడిగా ఉండడం వల్ల పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయనే మాటను వీరప్ప మొయిలీ ఖండించారు. సోనియా, రాహుల్ పాత్రలు పరస్పరం భర్తీ చేసుకునేవే తప్ప పరస్పరం వైరుధ్యానికి తావు ఇచ్చేవి కావని అన్నారు.