దటీజ్ వెంకయ్యనాయుడు, అలా ఎవరికీ సాధ్యం కాదు: మోడీ ప్రశంసలు
నిన్నటిదాకా మనతో మాట్లాడిన వెంకయ్యనాయుడిని ఇప్పుడు చైర్మన్ హోదాలో చూస్తుంటే గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యసభలో అడుగు పెట్టారు.
న్యూఢిల్లీ: నిన్నటిదాకా మనతో మాట్లాడిన వెంకయ్యనాయుడిని ఇప్పుడు చైర్మన్ హోదాలో చూస్తుంటే గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యసభలో అడుగు పెట్టారు.
ఆయన చైర్మన్ స్థానంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. వెంకయ్య రైతు బిడ్డ అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఉప రాష్ట్రపతి అయ్యారని చెప్పారు. ఏపీలో విద్యార్థి నాయకుడిగా వెంకయ్య ప్రస్థానం మొదలైందని చెప్పారు.

వెంకయ్యకు ప్రతి విషయం తెలుసు
గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం ఈ దేశ రాజ్యాంగం గొప్పతనం అన్నారు. వెంకయ్య ఉప రాష్ట్రపతి కావడం భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనం అన్నారు. గ్రామాల్లో రైతులకు సంబంధించి ప్రతి విషయం వెంకయ్యకు తెలుసునని చెప్పారు.

వెంకయ్య ప్రసంగం మాటల గారడి కాదు
వెంకయ్య ప్రసంగం కేవలం మాటల గారడి కాదని, ఆయన మాటలు ప్రజల హృదయాలను తాకేవని చెప్పారు. పార్లమెంటు గురించి తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన అన్నారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి కావడం ఓ లాయర్.. జడ్జి అయినట్లుగా ఉందన్నారు.

ఈ సభలోనే పెరిగి..
ఈ సభలోనే పెరిగి పెద్దవాడైన మొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఆయన మరింత వన్నె తెస్తారని చెప్పారు. పేదలు, రైతులు, దళితులు.. అన్ని అంశాలపై ఆయనకు అవగాహన ఉందన్నారు.

వెంకయ్యలా మాట్లాడటం ఎవరికీ సాధ్యం కాదు
వెంకయ్య ప్రసంగం వింటుంటే పాఠం చెప్పినట్లుగా ఉంటుందన్నారు. వెంకయ్య సంపన్న కుటుంబం నుంచి రాలేదన్నారు. దేశంలో తొలిసారి గ్రామాల్లో జన్మించిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా ఒకేసారి ఎన్నికయ్యారన్నారు. వెంకయ్య ఏ మాధ్యమంలోనైనా అనర్గళంగా మాట్లాడగలరన్నారు. ఆయనలా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదన్నారు.

వెంకయ్య రాజ్యసభకు కొత్త కాదు: ఆజాద్
వెంకయ్య కిందిస్థాయి నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారని గులాం నబీ ఆజాద్ అన్నారు. వెంకయ్య రాజ్యసభకు కొత్త కాదన్నారు. చాలాకాలంగా ఆయన సభలో సభ్యుడిగా ఉంటున్నారని చెప్పారు. రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగారన్నారు.

సభలో విభేదించినా.. ఆత్మీయ పలకరింపు: ఆజాద్
వెంకయ్య కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అంశాల్లో విభేదించినా, బయటకు వచ్చి ఆత్మీయంగా పలకరించేవారని ఆజాద్ చెప్పారు. కృషి, పట్టుదలతో వెంకయ్య ఈ స్థాయికి వచ్చారన్నారు.












Click it and Unblock the Notifications