బౌన్సర్లను పెట్టి మరీ.., టెక్కీల ధీన స్థితి: వెరిజాన్ నుంచి 1200మంది అవుట్!
Recommended Video
హైదరాబాద్: ఐటీ ఉద్యోగులపై 'లే ఆఫ్స్' కత్తి వేలాడుతూనే ఉంది. ఏ క్షణాన ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితిలో టెక్కీలు ఒత్తిడికి లోనవుతున్నారు. కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తీసేస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో పడుతున్నారు.
తాజాగా వెరిజాన్ కంపెనీ 1200మంది టెక్కీలను తొలగించింది. సంస్థ పునరుద్దరణ చర్యల్లో భాగంగా వీరిని తొలగించారు. తొలగించిన ఉద్యోగుల్లో ఎక్కువమంది హైదరాబాద్, బెంగళూరు బ్రాంచిల్లో పనిచేస్తున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలు ఊడిపోవడంతో వారు ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు.
న్యాయం చేయాలని:
ఉద్వాసనకు గురైన హైదరాబాద్ వెరిజాన్ ఉద్యోగులు లేబర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలంగాణను సంప్రదించారు. తమ సమస్యల గురించి వివరించి న్యాయం చేయాలని కోరారు. కాగా, వెరిజాన్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో దాదాపు 7వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది.
నిర్దాక్షిణ్యంగా వేటు.. కాస్ట్ కటింగ్ కూడా?: 'లే ఆఫ్స్'తో ఐటీ జీవులకు నిద్ర కరువు..
కంపెనీలు ఏమంటున్నాయి:
'కస్టమర్లకు మేము ప్రపంచ స్థాయి నాణ్యతను, ఉత్పత్తులను అందించాలనుకుంటున్నాం. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీ రీత్యా సంస్థాగతంగా మార్పులు తప్పట్లేదు. అందుకు అనుగుణంగానే టెక్నాలజీని సమకూర్చుంటున్నాం, అదే సమయంలో సంస్థను ప్రక్షాళన చేస్తూ వెళ్తున్నాం' అని వెరిజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.
టెక్కీలకు లే ఆఫ్స్ దెబ్బ?: ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో!, భయం భయంగా..
టాలెంట్ ఉంటేనే:
భవిష్యత్తులో కంపెనీ అవసరాల కోసం తగిన నైపుణ్యం, ప్రతిభ కలిగిన ఉద్యోగులకు తాము ప్రాధాన్యమిస్తున్నట్లు వెరిజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.
కాగా, బౌన్సర్లను పెట్టి మరీ తమను బెదిరించి బలవంతంగా తమ చేత రాజీనామా చేయించారని కొంతమంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐదంటే.. ఐదు నిమిషాల్లో తనతో రాజీనామా చేయించి ఆఫీస్ నుంచి పంపించారని 32ఏళ్ల ఓ ఐటీ ఉద్యోగి వాపోయాడు.
బలవంతంగా:
చెన్నైలోని వెరిజాన్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీనిపై ఓ టెక్కీ స్పందిస్తూ.. 'ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా క్యాబిన్ లోకి వచ్చారు. పెర్ఫామెన్స్ అప్రైజల్ ఫామ్ తీసుకొచ్చి రాజీనామా చేయాల్సిందిగా బలవంతం చేశారు. ఒక క్రిమినల్ ను ట్రీట్ చేసినట్లు బౌన్సర్లను పెట్టి మరీ రాజీనామా చేయించడం బాధపెట్టింది' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ ప్రతినిధులు మాత్రం దీన్ని ఖండించారు. బౌన్సర్లు ఎవరిని బెదిరించలేదని చెబుతున్నారు.
ఆటోమేషన్ ప్రభావం:
ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల సంఖ్య పడిపోతోంది. పైగా మునుపటి కన్నా ప్రాజెక్టులు తగ్గిపోవడం కూడా రిక్రూట్ మెంట్స్ మందగమనానికి కారణంగా తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులు దక్కించుకోవాలంటే కొత్త టెక్నాలజీ తప్పనిసరి కాబట్టి కంపెనీలు అటువైపుగా దృష్టి సారించాయి.
ప్రస్తుతం చాలావరకు కంపెనీలు అందివచ్చిన కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఇందుకోసం అప్పటికే ఉన్న ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం కన్నా.. అప్పటికే ఆ టెక్నాలజీపై తర్ఫీదు పొందినవారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. దీంతో ఉద్యోగులకు ఉద్వాసన తప్పట్లేదు.