కొట్టలేదు.. బయటికి నెట్టానంతే, నువ్వేమైనా మోడీవా అంటూ అవమానించారు: లోక్ సభలో మాటమార్చిన గైక్వాడ్
ఎయిరిండియా ఘటనపై ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మాట మార్చారు. పార్లమెంటు సాక్షిగా జరిగినదాంట్లో తన తప్పేం లేదంటూ ఎయిర్ ఇండియా సిబ్బందినే తప్పు పడుతూ ఆయన ధ్వజమెత్తారు.
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం పార్లమెంటులో మాట్లాడారు. తాను ఎవరిపైనా చేయిచేసుకోలేదనీ... ఎయిరిండియా ఉద్యోగులే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.
ఘటన జరిగిన రోజు తాను ఎయిరిండియా ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టానంటూ గైక్వాడ్ పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. తీరా పార్లమెంటు సాక్షిగా ఆయన తన తప్పేం లేదని, ఎయిరిండియా సిబ్బందే తనపై దురుసుగా ప్రవర్తించారని, తనను అవమానించారని ఎదురుదాడికి దిగారు.

ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ శివసేన ఎంపీలు డిమాండ్ చేయడంతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గైక్వాడ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన గైక్వాడ్... మొదలు పెడుతూనే ఎయిరిండియాపై విరుచుకుపడ్డారు.
''నేనేమీ తప్పు చేయలేదు. నాకు పశ్చాత్తాపం కూడా లేదు. మీడియానే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. నేను ఎవరినీ కొట్టలేదు. నేను అతడిని విమానంలో నుంచి బయటికి నెట్టానంతే.. నేను విమానంలో ఎయిరిండియా సిబ్బందితో ఘర్షణ పడ్డానన్నది అవాస్తవం..'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంకా.. ''నిజానికి నేను కూర్చోవాల్సిన సీటును ఓ వృద్ధుడికి ఇచ్చాను. కానీ ఎయిరిండియా ఉద్యోగులు మాత్రం వేరే కథలు చెప్పారు. నాకు బిజినెస్ క్లాసులో సీటు ఉన్నప్పటికీ... నన్ను ఎకానమీ క్లాసులో కూర్చోబెట్టారు. 'ఎంపీ అయితే ఏంటి? నువ్వేమైనా ప్రధాని మోడీవా?? అంటూ సిబ్బందే నన్ను అవమానించారు..'' అని గైక్వాడ్ పేర్కొన్నారు.
అంతేకాదు, ఎయిరిండియాపై కఠిన చర్యలు తీసుకోవాలని గైక్వాడ్ డిమాండ్ చేశారు. తన మీద ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారో తనకు తెలియదని, దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రిని కోరుతున్నానన్నారు.












Click it and Unblock the Notifications