వారి దుర్మార్గం అంతా ఇంతా కాదు : మరోసారి విరుచుకుపడ్డ శశి థరూర్
భారతదేశాన్ని బ్రిటీష్ పాలకులు ఏవిధంగా నాశనం చేశారో భావి తరాలకు వివరించేందుకు మ్యూజియంను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ : భారతదేశంలో బ్రిటన్ పాత్రను భావి తరాలకు వివరించేందుకు ప్రదర్శనశాల (మ్యూజియం)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పిలుపునిచ్చారు.
భూమి మీద అత్యంత నిరుపేద, నిరక్షరాస్య, రోగగ్రస్థ ప్రదేశాల్లో ఒకదానిగా భారతదేశాన్ని బ్రిటన్ సామ్రాజ్యవాద శక్తులు మార్చాయని, ఆ వివరాలను భారతీయులకు, బ్రిటిషర్లకు వివరించేందుకు ప్రదర్శనశాల అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఆ దారుణాలు అందరికీ తెలియాలి..
అంతర్జాతీయ మీడియాకు ఆయన రాసిన ఓ వ్యాసంలో ఈ మేరకు పిలుపునిచ్చారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వారసత్వ కట్టడాల్లో ఒకటైన కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ను ప్రదర్శనశాలగా మార్చాలని కోరుతూ తాను భారత ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలనలో జరిగిన దుశ్చర్యల వివరాలను ప్రదర్శించాలని కోరినట్లు పేర్కొన్నారు.
బ్రిటిష్వారు భారతదేశానికి ఏం చేశారో గుర్తు చేసుకోవడానికి ప్రదర్శనశాల ఉపయోగపడుతుందని శశి థరూర్ అన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో భారతదేశం ఒకటి అని, 1700వ సంవత్సరంలో ప్రపంచ జీడీపీలో భారతదేశం వాటా 27 శాతం ఉండేదని వివరించారు.
పీల్చి పిప్పిచేసి వదిలేశారు..
అలాంటి భారత్ను బ్రిటిష్వారు స్వాధీనం చేసుకుని, 200 ఏళ్లు దోచుకుని, చివరికి 1947లో వదిలిపెట్టే సమయానికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత నిరుపేద, తీవ్ర రోగగ్రస్థ, దారుణమైన నిరక్షరాస్యత గల దేశంగా మార్చారని ఆరోపించారు.
భారతదేశ జౌళి పరిశ్రమను బ్రిటీష్ వారు ధ్వంసం చేశారని, బెంగాల్లోని అద్భుతమైన చేనేత కేంద్రాలను నాశనం చేశారని పేర్కొన్నారు. నౌకా నిర్మాణ కేంద్రాలను పద్ధతి ప్రకారం కుదేలైపోయేలా చేయడంతో పాటు భారతదేశానికి కీలకమైన వూట్జ్ స్టీల్ నాశనానికి కూడా వారే కారకులని శశిథరూర్ ఆ వ్యాసంలో వివరించారు.












Click it and Unblock the Notifications