శివసేనకు రూ. 85 కోట్లు ఇచ్చిన వీడియోకాన్
ముంబై: శివసేన పార్టీకి జాక్ పాట్ లో భారీగా విరాళం వచ్చింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుపొందిన వీడియోకాన్ సంస్థ మహారాష్ట్రలోని శివసేన పార్టీకి రూ. 85 కోట్లు విరాళం ఇచ్చింది. శివసేనకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చే సంస్థగా ఇప్పుడు వీడియోకాన్ గుర్తింపు తెచ్చుకుంది.
ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన అఫిడివిట్ లో శివసేన పేర్కొంది. 2015-16 సంవత్సరంలో కార్పొరేట్ సంస్థలతో పాటు ఇతర సంస్థల నుంచి శివసేనకు రూ. 86.84 కోట్లు విరాళం రూపంలో వచ్చింది. అందులో ఒక్క వీడియోకాన్ సంస్థ రూ. 85 కోట్లు విరాళం ఇచ్చింది.
మిగిలిన వారు రూ.1.84 కోట్లు విరాళం ఇచ్చారని శివసేన ఎన్నికల అధికారులకు అఫిడివిట్ ఇచ్చింది. ఆదాయపన్నుకు సంబంధించిన సెక్షన్ ప్రకారం శివసేన ఈ వివరాలు వెల్లడించింది.
అయితే ఇదే వీడియోకాన్ సంస్థ శరద్ పవార్ కు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రూ. 25 లక్షలు మాత్రమే విరాళంగా ఇచ్చింది. వీడియోకాన్ సంస్థ రెండు పార్టీలకు ఇంత పెద్ద మొత్తం తేడాతో విరాళం ఇచ్చింది.
2016 సెప్టెంబర్ 27వ తేదీన శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు అనీల్ దేశాయ్ ఈ వివరాలు ఎన్నికల కమిషన్ కు అఫిడివిట్ సమర్పించారు. ఈ పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి.
బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ కు ఎంత విరాళం వచ్చింది అనే వివరాలు సమర్పించలేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ కూడా ఎన్నికల కమిషన్ కు ఎంత విరాళం వచ్చింది అనే వివరాలను సమర్పించాయి.