నాడు పవన్ చెప్పిందే.. నేడు విజయ్ చెప్పాడు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మహిళలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. త్రిబుల్ బొనాంజా ప్రకటించారు. కలైజ్ఞార్ మగళిర్ ఉరిమై థొగై పథకం కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఇది- ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన మొత్తం. నెలకు 1,000 చొప్పున 3,000 రూపాయలతో పాటు అదనంగా ప్రత్యేక వేసవి సహాయం కింద మరో 2,000లు కూడా జమ చేశారు.
డబ్బులు పెట్టి ఓట్లను కొంటోన్నారు..
దీనిపై టీవీకే అధినేత విజయ్ ఘాటు విమర్శలు గుప్పించారు. సేలం జిల్లా శీలనాయగన్పట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. డబ్బులు పెట్టి ఓట్లను కొంటోన్నారని మండిపడ్డారు. ఈ సంస్కృతి ఆగిపోవాలని, ఓట్లను కొనుగోలు చేసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. డీఎంకే సంక్షేమ కార్యక్రమాలను తీవ్రంగా తప్పుపట్టారు. టీవీకే నుంచి ఓటమి భయం ముంచుకొచ్చిందని, ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికిప్పుడు 5,000 రూపాయలను మహిళల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేశారని ఆరోపించారు.

నా ఓటు నా హక్కు..
ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ఈ సందర్భంగా విజయ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. "ఓట్ల కోసం డబ్బులు ఇవ్వడం ఆగిపోవాలి. నా ఓటు నా హక్కు. మన ఓట్లను ఎవరూ కొనలేరు. మనం మోసపోము.." అని నినదించారు. ఎటువంటి ప్రలోభాలు, ఒత్తిళ్లు, రాజకీయ తాయిలాలకు తలొగ్గకుండా ప్రతి ఒక్క ఓటర్ కూడా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయ్ పిలుపునిచ్చారు. అవినీతి రాజకీయ పద్ధతులకు వ్యతిరేకంగా తన పార్టీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తుందని తేల్చి చెప్పారు.
నా ఇల్లు మొత్తం తమిళనాడు..
"ధైర్యం ప్రతిదానికీ ఆధారం. మనలను ఎవరైనా తక్కువగా అంచనా వేసినప్పుడు అది.. దానంతట అదే మొదలవుతుంది. ఆ ధైర్యాన్ని మన విమర్శకులు, శత్రువులకు నిరూపించాల్సిన సమయం వస్తుంది.." అని అన్నారు. తన రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నిస్తున్న విమర్శకులకు విజయ్ దీటుగా బదులిచ్చారు. ఇలా ప్రశ్నిస్తోన్న వారికి తన ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? నా ఇల్లు మొత్తం తమిళనాడు. నా ఇంట్లో ఎంత మంది ఉన్నారో మీకు తెలుసా? 8 కోట్లకు పైగా ప్రజలు నా ఇంట్లో నివసిస్తున్నారు. ఈ 8 కోట్ల మంది ప్రజలకు నేను అండగా ఉంటాను.." అని భావోద్వేగంతో ప్రకటించారు.
ఓట్లు అడగడానికి రాలేదు..
"మీ విజయ్ కేవలం ఓట్లు అడగడానికి రాలేదు, న్యాయం కోరడానికి వచ్చాడు.. " అని ఆయన విజయ్ చెప్పారు. ఈ రాజకీయ పోరాటం నేరుగా డీఎంకే- టీవీకేకు మధ్యేనని స్పష్టంచేశారు. మేనిఫెస్టో అమలులో ప్రభుత్వం పదేపదే అబద్ధాలు చెబుతోందని ఇది ఇలాగే కొనసాగితే, అబద్ధాలపై అబద్ధాలు చెబుతారని ఈ ఎన్నికల్లో దీనికి బ్రేకులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత గురించి మాట్లాడే హక్కు ముఖ్యమంత్రికి లేదని, రాష్ట్ర డీజీపీ పోస్ట్ ఇంకా ఖాళీగా ఉంచారని నిలదీశారు.
ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదు..
ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చెబితే సరిపోదని, రాష్ట్రంలో రైతులు, మత్స్యకారులు, డాక్టర్లు.. ఎందుకు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారని విజయ్ ప్రశ్నించారు. తాను ఏ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేయలేదని, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడానికే ఇక్కడికి వచ్చానని వివరించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని, ఏ ఇతర జెండానూ మోయబోమనీ కుండబద్దలు కొట్టారు. సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీని సాధిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications