కోర్టులో హాజరు కాలేదంటే.. ప్రకటిత అపరాధివే: మాల్యాపై తేల్చేసిన పాటియాలా కోర్టు
న్యూఢిల్లీ: సుమారు 9వేలకోట్ల బ్యాంకు రుణాలను లండన్ పారిపోయి తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా న్యాయస్థానం ఎదుట హాజరు కావాల్సిందిగా ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశించింది. డిసెంబరు 18లోగా మాల్యా కోర్టు ముందు హాజరుకాకపోతే.. ప్రకటిత అపరాధిగా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఫెరా ఉల్లంఘనల కేసులో మాల్యాను ప్రకటిత అపరాధిగా నిర్ణయించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ఢిల్లీకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్పై అత్యవసర విచారణ జరిపిన చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ దీపక్ శెర్వాత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఫెరా ఉల్లంఘన కేసులో మాల్యాను విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ మాల్యా మాత్రం విచారణకు హాజరుకావడం లేదు. దీంతో అతడిని ప్రకటిత అపరాధిగా వెల్లడించాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది.
ఈ క్రమంలో పలు కేసుల్లో మాల్యాపై నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యాను ఇటీవల లండన్లో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన కొన్ని నిమిషాల్లోనే బెయిల్పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో పాటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications