మాల్యాకు షాక్: రూ.1,400 కోట్లు జప్తు చేసిన ఈడీ
ముంబై: దేశీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి గట్టి దెబ్బ పడింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ రుణ ఎగవేత కేసులో శనివారం 1,411 కోట్ల రూపాయల విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) మాల్యా, యుబి లిమిటెడ్ ఆస్తులను ఇడి జప్తు చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో 34 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, బెంగళూరులోని 2,291 చదరపు అడుగుల ఫ్లాట్, ముంబైలోని 1,300 చదరపు అడుగుల ఫ్లాట్, చెన్నైలోని 4.5 ఎకరాల పారిశ్రామిక స్థలం, కూర్గ్లోగల 28.75 ఎకరాల కాఫీ తోట, బెంగళూరులోని యుబి సిటీ, కింగ్ఫిషర్ టవర్లలో 84,0279 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నివాస, వాణిజ్య సముదాయాలున్నాయి.
ఐడిబిఐ బ్యాంక్ నుంచి 900 కోట్ల రూపాయల రుణాన్ని పొంది దాన్ని తిరిగి చెల్లించని కేసులో భాగంగా ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పేరిట విజయ్ మాల్యా ఎస్బిఐసహా 17 బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.
అయితే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్.. చివరకు ఉద్యోగులకు జీతాలను, చమురు సంస్థలకు బకాయిలు కూడా చెల్లించలేకపోయింది. విమానాశ్రయాలకు విమానాల నిర్వహణ బకాయిలనూ చెల్లించకుండానే విమానయాన సేవలను నిలిపివేసింది.
ఈ క్రమంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల విలువ 9,000 కోట్ల రూపాయలను దాటిపోవడంతో మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. కాగా, మార్చి 2న లండన్కు మాల్యా రహస్యంగా పారిపోయాడు. దీంతో బ్యాంకులు కోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం కూడా చేస్తున్నాయి.