రజనీకాంత్తో భేటీ: మోడీ తీరుపై విజయకాంత్ కలత
చెన్నై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం భారత సూపర్ స్టార్ రజనీకాంత్ను కలుసుకోవడం ఎన్డీయే కూటమిలోని డిఎండికె అధ్యక్షులు విజయకాంత్కు ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తోంది. మోడీ వెళ్లి రజనీని స్వయంగా కలవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు.
మరోవైపు ఆదివారం చెన్నైలో జరిగిన మోడీ ర్యాలీలో విజయ్ కాంత్ గానీ, ఆయన పార్టీ నేతలు గానీ పాల్గొనలేదు. తమిళనాడులో బిజెపి ఏడు పార్టీలతో కలసి మహా కూటమిగా ఏర్పడడంలో డిఎండికె తనవంతు పాత్ర పోషించింది. ఈ కూటమిలో పెద్ద పార్టీ కూడా ఇదే.

అంతేకాకుండా మోడీని ప్రధానిని చేయాలని విజయ్ కాంత్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. దేశంలోని అవినీతిని ఆయనొక్కరే నిర్మూలించగలరంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, మోడీ చెన్నైకి వచ్చి అగ్ర నటుడు రజనీకాంత్ను కలవడం, తనను విస్మరించడం ఆయన్ను బాధించిందట.
మోడీ పర్యటన గురించి కూడా సమాచారం లేకపోవడంతో విజయ్ కాంత్ అసంతృప్తికి లోనయ్యారని చెప్పాయి. బిజెపికి మద్దతు పలకకపోయినా మరో నటుడికి ఆ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విజయ్ కాంత్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, మోడీ సభలో విజయకాంత్ పాల్గొనక పోవడానికి అసంతృప్తి కారణం కాదని కూడా చెబుతున్నారు. శనివారమే ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా ప్రచారం మధ్యలోనే ముగించుకొని వచ్చారని, అలాగే ఆదివారం కూడా పాల్గొనలేకపోయారంటున్నారు.












Click it and Unblock the Notifications