‘కులం గోడ‘ ఘటనలో ట్విస్ట్.. మేం హిందువులమే.. ఇస్లాంలోకి మారట్లేదన్న దళితులు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తమిళనాడు 'కులం గోడ' ఘటనలో బాధిత దళిత కుటుంబాలు హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాంలోకి చేరబోతున్నాయన్న ప్రచారం అంతా వట్టిదేనని తేలింది. బంధువులు బలైంది కులరక్కసికే అయినప్పటికీ తాము హిందూ మతాన్ని విడిచిపెట్టబోయేదిలేదని దళిత కుటుంబాలు స్పష్టం చేశాయి. అంతేకాదు, తాము ఇస్లాంలోకి చేరబోతున్నట్లు తప్పుడు ప్రచారం చేసిన సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామనీ తెలిపాయి. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.
అసలేం జరిగిందంటే..
పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలం మండలంలోని నండూర్ గ్రామంలో డిసెంబర్ 2న భారీవర్షానికి ఓ ప్రహారీ గోడ కూలి దళితుల గుడిసెలపై పడింది. ఈ ప్రమాదంలో పదిమంది మహిళలు, ఇద్దరు పిల్లు సహా మొత్తం 20 మంది చనిపోయారు. గ్రామానికి చెందిన ఓ వ్యాపారి తన స్థలంగుండా దళితులు నడవోద్దని నిర్మించిన ఆ ప్రహారీ.. ‘కులం గోడ'గా వార్తల్లోకెక్కింది.
ఘటన జరిగిన కొద్దిరోజులకే.. హిందూ మతంలోని కులవివక్షను నిరసిస్తూ నండూర్ సహా చుట్టుపక్కల గ్రామాల్లోని 3వేల మంది దళితులు ఇస్లాంలోకి చేరబోతున్నట్లు ‘తమిళ్ పులిగళ్ కట్చి'అనే సంస్థ ప్రకటన చేసింది. ఒక దశలో ఈ మతమార్పిడులు సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి.
మా బతుకులతో ఆడుకోవద్దు..
గోడ కూలిన తర్వాత.. ఇస్లాం మత ప్రచార సంస్థ ‘తమిళ్ పులిగళ్ కట్చి‘ ప్రతినిధులు గ్రామానికి వచ్చినమాట వాస్తవమేనని, అయితే మతం మారుతున్నామనడం మాత్రం అబద్ధమని, ప్రమాదాన్ని అడ్డంపెట్టుకుని పేదల బతుకులతో ఆడుకోవడం సరికాదని నడూర్ గ్రామానికే చెందిన సుబ్రమణియన్ అనే దళిత వ్యక్తి చెప్పారు. తాము ఎప్పటినుంచో రాముణ్ణి పూజిస్తున్నామని, పండుగలప్పుడు మాంసం కూడా ముట్టబోమని, మతాన్ని మార్చుకోబోమని కాళి అనే మహిళా రైతుకూలి తెలిపారు. ‘కులం గోడ‘బాధిత కుటుంబాల బంధువులందరూ మతమార్పిడి వార్తల్ని ఖండించారు.
పోలీసులకు భయపడి ఇలా చెప్పారు..
నడూర్ లో కులం గోడ కూలిన తర్వాత రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయిందని, పోలీసుల్ని మోహరించిందని, పోలీసులు బెదిరించడం వల్లే దళిత కుటుంబాలు ఇస్లాంలో చేరడంలేదని ప్రకటన చేశాయని ‘తమిళ్ పులిగళ్ కట్చి' ప్రతినిధి ఇళవేణి మీడియాతో అన్నారు. తమిళనాడులో కులవివక్షకు వ్యతిరేకంగా దళితులు మతం మారడం కొత్తేమీ కాదని, నడూర్ బాధితులు ఇవాళ కాకుంటే రేపైనా ఇస్లాంలోకి వస్తారని ఆమె చెప్పారు. మరి 3వేల మంది చేరబోతున్న ప్రకటన అబద్ధమేనా? అని ప్రశ్నించగా.. కోయంబత్తూర్, త్రిసూర్ కు చెందిన 300 దళిత కుటుంబాలు మాత్రమే మతం మారబోతున్నాయంటూ సమాధానం దాటవేశారు.
గోడకట్టినోడికి బెయిల్.. దళితులేమో జైలులో..
నడూర్ మతమార్పిడుల వార్తలపై వీసీకే పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ డి.రవికుమార్ స్పందించారు. కులం గోడ కట్టిన వ్యాపారి ప్రస్తుతం బెయిల్ పై దర్జాగా తిరుగుతున్నాడని, గోడకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన దళితులేమో ఇంకా జైల్లోనే మగ్గుతున్నారని ఆయన చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వ వ్యవహారశైలితో దళితులు మరింత అన్యాయానికి గురవుతున్నారని, అందుకే తరచూ మతమార్పిడిల అంశం తెరపైకొస్తున్నదని తెలిపారు.