బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస: మూడేళ్ల చిన్నారికి బుల్లెట్ గాయాలు
బెంగాల్ : వెస్ట్ బెంగాల్లో స్థానిక ఎన్నికలు హింసకు దారితీశాయి. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీజేపీ పంచాయతీ సభ్యురాలి మూడేళ్ల కుమారుడిపై తృణమూల్ కార్యకర్తలు కాల్పులు జరిపారు. పంచాయతీ బోర్డు ఏర్పాటు సందర్భంగా మానిక్చక్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
కాల్పుల్లో గాయపడిన మృణాల్ అనే మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ సభ్యురాలు పొటుల్ మండాల్ కుమారుడు మృణాల్. మండాల్ అంతకుముందు టీఎంసీలో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. మానిక్చక్ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె బీజేపీ టికెట్ పై పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ 10 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 6 సీట్లు కాంగ్రెస్ 1 స్వతంత్ర అభ్యర్థి 1 సీటు గెలిచాయి. గ్రామ సర్పంచ్ను ఎన్నుకునే సమయంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్లకు చెరో 9 ఓట్లు వచ్చాయి. దీంతో లాటరీ వేయగా సర్పంచ్, ఉప సర్పంచ్ పోస్టులను బీజేపీకే దక్కాయి.
అంతకుముందే తృణమూల్ పార్టీకి మాండల్ మద్దతు తెలిపితే ఆమెకు రూ.7 లక్షలు డబ్బును తృణమూల్ కాంగ్రెస్ ఎరవేసిందని... ఆ డబ్బు అడిగేందుకు వెళ్లిన సమయంలో తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఆమెపై దాడి చేయడంతో మాటామాటా పెరిగి పెద్ద ఘర్షణవాతావరణానికి దారి తీసింది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తుపాకీతో కాల్పులు జరపగా బులెట్లు కాస్త మూడేళ్ల చిన్నారిపైకి దూసుకెళ్లాయి. ఇదిలా ఉంటే... నార్త్ 24 పరగనాస్ జిల్లాలో గ్రామపంచాయతీ బోర్డు ఏర్పాటు సమయంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు.
ఆగష్టు 27న మాల్డాలో జరిగిన హింసాత్మక ఘటనలో ఇద్దరు మృతి చెందనగా పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శాంతి పాటించాలని పిలుపునిచ్చినప్పటికీ కార్యకర్తలు ఎక్కడా తగ్గలేదు.