విభజించాలనుకునే దుష్టశక్తుల ఎత్తులు పారవు: నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను తెలియజేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీలో అల్లర్లపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

వారి ఎత్తులు పారవు..
విభజించాలనుకునేవాళ్ల ఎత్తులు పారనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం లభించింది. దేశంలోని మెజార్టీ పార్టీలు సైతం దీనికి మద్దతు తెలిపాయని మోడీ వివరించారు. ఈ బిల్లుతో ఏ మతానికి చెందిన వారికి కూడా నష్టం లేదని తెలిపారు.

ఎవరికీ నష్టం లేదు.. స్వార్థపూరిత శక్తుల వల్లే..
పౌరసత్వ సవరణ బిల్లు గురించి భారతీయ పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క భారతీయ పౌరుడికి దీని వల్ల నష్టం ఉండదని హామీ ఇస్తున్నా. కొన్ని స్వార్థపూరిత శక్తులు సమాజంలో విడగొట్టే చర్యలు చేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. చర్చల ద్వారా సమస్యలపై పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనని, కానీ, ప్రజా ఆస్తికి నష్టం చేయకూడదని అన్నారు.

ఆ దుష్టశక్తులకు అనుమతి లేదు..
సమాజంలో అల్లర్లు సృష్టించాలనుకునే స్వార్థపూరిత దుష్ట శక్తులకు తాము అనుమతివ్వబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పస్టం చేశారు. ఇది మనకు శాంతి, సామరస్యం, సోదరభావం చాటాల్సిన కీలక సమయమని అన్నారు. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ హింసకు దూరంగా ఉండాలని కోరారు.

అభివృద్ధి మార్గంలో..
అందరం కలిసి దేశాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాల్సిన సమయమని అన్నారు. పేదల సాధికారత కోసం పనిచేయాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఢిల్లీలో కూడా ఆందోళనలు భారీ ఎత్తున సాగుతున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులు రెండ్రోజులుగా ఆందోళన చేస్తూ బస్సులను దగ్ధం చేశారు. ఆదివారం రాత్రి వరకు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, యూనివర్సిటీలోకి పోలీసులు రావడంపై వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ గదుల్లోకి వచ్చి కొట్టారని పలువురు విద్యార్థులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications