vishal in: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ, నియోజకవర్గం వేట!
చెన్నై: ప్రముఖ తమిళ హీరో విశాల్ రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విశాల్ ఇప్పటికే నిర్మాతల సంఘం, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే.
గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీకి దిగినా..
గత అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన ఆర్కేనగర్ స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అయితే, చివరి క్షణంలో నామినేషన్ను ప్రతిపాదించిన పదిమందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో పోటీ చేయలేకపోయారు.
అనుకూలమైన అసెంబ్లీ సీటు కోసం విశాల్ వేట..
ఈ నేపథ్యంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నగర పరిధిలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న విశాల్.. తన సన్నిహితులతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నారు. తనకు అనుకూలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కసరత్తులు చేస్తున్నారు. త్వరలోనే తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంపై విశాల్ అధికారికంగా ప్రకటించనున్నారు.
రజినీ, కమల్ కూడా ఎంట్రీ..
ఇప్పటికే ప్రముఖ నటులు రజినీకాంత్, కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ తన పార్టీని జనవరిలో ప్రకటించనున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఇక అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి.
ఇటు బీజేపీ.. అటు శశికళ విడుదల..
ఇక బీజేపీ కూడా ఈసారి తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన సినీనటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ కూడా ఇటీవల బీజేపీలో చేరి క్రియాశీలకంగా మారిన విషయం తెలిసిందే.ఇది ఇలావుంటే, జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరు జైలు నుంచి జనవరిలో విడుదల కానుండటంతో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.