జయలలిత కోరడంతోనే వీడియో తీశాం, మమ్మల్ని రక్షించుకోవడానికి కాదు: టీటీవీ దినకరన్!
చెన్నై: జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె కోరిక మేరకే వీడియోను తీశామని, దానిని బయటపెట్టాలనే ఉద్దేశం శశికళకు లేదని టీటీవీ దినకరన్ చెప్పారు. ఆ వీడియోను చేర్చాల్సిన చోటకు చేర్చుతామని టీటీవీ దినకరన్ తెలిపారు.
జయలలితకు 4 ఏళ్లలో సెప్టెంబర్ 27వ తేదీ ఏం జరిగింది: జైలు, సీఎం, అపోలో, మృతిపై విచారణ!
ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో టీటీవీ దినకరన్ ఈ వివరాలు చెప్పారు. జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించే వరకూ శశికళ మీద దుష్ప్రచారం చేస్తున్నారని, డీఎంకే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందని టీటీవీ దినకరన్ ఆరోపించారు.
పన్నీర్ సెల్వంను ప్రశ్నించండి
జయలలిత మరణం గురించి అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ప్రశ్నించడం మానేసి తమ మీద నిందలు వేస్తున్నారని తమిళనాడు మంత్రులపై టీటీవీ దినకరన్ మండిపడ్డారు. మంత్రులు పరస్పరం విరుద్దమైన వ్యాఖ్యలతో ఇప్పుడు దొరికిపోయారని టీటీవీ దినకరన్ ఆరోపించారు.
వీరే సమాధానాలు చెప్పాలి
జయలలిత మరణంపై అప్పటి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు, అధికారులు, మంత్రులు సమాధానం చెప్పాలని టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు. జయలలిత మరణంపై సమాధానం ఇవాల్సిన బాధ్యత వీరందరికి ఉందని టీటీవీ దినకరన్ తెలిపారు.
పదవుల కోసం కాళ్లు పట్టుకున్నారు
పదవుల కోసం శశికళ కాళ్ల మీద పడిన మంత్రులు అందరూ ఇప్పుడు ఆమెను విమర్శిస్తున్నారని టీటీవీ దినకరన్ ధ్వజమెత్తారు. జయలలితను చూసేందుకు ఆసుపత్రికి వెచ్చినవారిని శశికళ అడ్డుకున్నారని ఇప్పుడు ఆరోపించడం సరైన పద్దతి కాదని టీటీవీ దినకరన్ చెప్పారు.
వీడియో అమ్మ చూసేందుకే
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను ఎలాగున్నాను అని బయటకు వచ్చిన తరువాత చూడాలని జయలలిత కోరడంతోనే శశికళ వీడియో తీశారని టీటీవీ దినకరన్ వివరించారు. స్నేహం కోసం విలువ ఇచ్చి ఎలాంటి అపకీర్తి వచ్చినా శశికళ ఆ వీడియోను బయట పెట్టలేదని టీటీవీ దినకరన్ చెప్పారు.
పళని, పన్నీర్ ద్రోహం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ద్రోహం పరాకాష్టకు చేరుకుందని, వారికి త్వరలో బుద్ది చెబుతామని టీటీవీ దినకరన్ విమర్శించారు. అప్పుడు నోరు విప్పని పళనిసామి, పన్నీర్ సెల్వం, మంత్రులు ఇప్పుడు ఎందుకు ఇలా మా మీద ఆరోపణలు చేస్తున్నారని టీటీవీ దినకరన్ ప్రశ్నించారు.
సీబీఐ విచారణకు డిమాండ్
జయలలిత వైద్య చికిత్స విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, అందువలన తాము సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నామని టీటీవీ దినకరన్ చెప్పారు. మా దగ్గర ఉన్న వీడియోను విచారణ కమిషన్ కు ఇస్తామని, దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని టీటీవీ దినకరన్ అన్నారు.
మన్నార్ గుడి మాఫియా రివర్స్ గేర్
శశికళ తనను తాను కాపాడుకోవడానికి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వీడియో తియ్యలేదని టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే పూర్తి సమాచారం విచారణ కమిషన్ దర్యాప్తులో వెలుగు చూడవలసి ఉంది.