వొడాఫోన్ పోటా పోటీ ఆఫర్... అదనపు డేటా ప్రకటించిన జియో
రిలయన్స్ జియో ప్రకటించిన ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రాంకు ధీటుగా వొడాఫోన్ శుక్రవారం కొత్త టారిఫ్ పథకాలను ప్రకటించింది.
ముంబై: టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో దేశీయ ఆపరేటర్లు తమ ఖాతాదారులను నిలుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. దాదాపు అన్ని టెలికాం సేవల సంస్థలు వినియోగదారులపై వరుస ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి.
తాజాగా ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ తన ఖాతాదారులు రిలయన్స్ జియోకు తరలిపోకుడా ఉండేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కొత్త టారిఫ్ లను శుక్రవారం ప్రకటించింది.
ఇటీవల రిలయన్స్ జియో ప్రకటించిన ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రాంకు ధీటుగా వొడాఫోన్ కొత్త టారిఫ్ పథకాలను ప్రకటించింది. నెలకు రూ.346 రీచార్జ్ పై 28 జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్ లు వంటి ప్రయోజనాలను అందించనుంది. ఈ ఆఫర్ మార్చి 15 వరకు మాత్రమే చెల్లుబాటవుతుందని వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది.
జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం వినియోగదారులు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కానీ వొడాఫోన్ వినియోగదారులు ఇలాంటి ఫీజు లేకుండానే ఆ మంత్లీ ప్లాన్ ను ఎంజాయ్ చేయొచ్చు.
మరోవైపు జియో కూడా తన ప్రైమ్ మెంబర్ షిప్ పథకంలో ప్రకటించిన డేటా ప్రయోజనాలకు అదనపు డేటా జోడిస్తూ శుక్రవారం 'బై వన్ గెట్ వన్' ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ప్రకారం రూ.303తో రీచార్జ్ చేసుకునే ప్రైమ్ యూజర్లకు ఇది వరకు ప్రకటించిన విధంగా 28 జీబీ డేటా కాకుండా అదనంగా మరో 5 జీబీ డేటాను అందిస్తుంది. అలాగే రూ.499తో రీచార్జ్ చేసుకునే వారికి 56 జీబీ డేటాతోపాటు మరో 10 జీబీ డేటాను అదనంగా అందిస్తుంది.