ఆడియో టేపుల కలకలం: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేతో కేంద్రమంత్రి మంతనాలు, ఎంక్వైరీకి రెడీ: షెకావత్..
రాజస్తాన్లో రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. అశోక్ గెహ్లట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ ధిక్కార స్వరం వినిపించడంతో బల బలాలు, సంప్రదింపులు జోరందుకున్నాయి. అయితే రెబల్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మతో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంప్రదింపులు జరిపారనే ఆడియో టేపులు గుప్పుమన్నాయి. కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్కు రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అయితే దీనిని షెకావత్ ఖండించారు. విచారణకు సిద్ధమని, తాను ఎవరితో సంప్రదింపులు జరపలేదని స్పష్టంచేశారు.
Recommended Video
ఆడియో టేపులు..
ప్రభుత్వాన్ని కూల్చేందుకు షెకావత్ ప్రయత్నించారని.. రెండు ఆడియో0టేపులు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. బీజేపీ కుట్రను వెలికితీయాలని ఎస్ఓజీ పోలీసులను కోరారు. దీంతో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్ జైన్, భన్వర్ లాల్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ వాయిస్ నాది కాదు..
ప్రభుత్వ ఆరోపణలను షెకావత్ ఖండించారు. ఆ వాయిస్ తనకి కాదు అని స్పష్టంచేశారు. సంజయ్ జైన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారో తనకు తెలియదన్నారు. ఆ పేరుతో చాలా మంది ఉంటారని తెలిపారు. అయితే తాను ఎవరితో మాట్లాడితే.. తన నంబర్ అక్కడ ఉండాలన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు. అందుకు తాను సిద్ధమని మరోసారి స్పష్టంచేశారు.
షెకావత్ కుట్ర
కాంగ్రెస్ నేతలు మాత్రం షెకావత్ కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. షెకావత్ కేంద్రమంత్రి అని, విచారణను ప్రభావితం చేస్తారని రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఆయన తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షెకావత్పై వెంటనే వారెంట్ జారీచేయాలని, శర్మ, జైన్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే.. నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
సభ్యత్వం రద్దు
రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కాంగ్రెస్ రద్దు చేసింది. ధిక్కార స్వరం వినిపించడంతో షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అవాస్తవాలేనని రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మ ఖండించారు. ఆ ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని ఆయన భన్వర్ లాల్ శర్మ స్పష్టం చేశారు.