జెడిఎస్కు ఓటేయండి, సామాన్యుల ఫ్రంట్, కావేరీ సమస్య ఎందుకు పరిష్కరించలేదు: కెసిఆర్
Recommended Video

బెంగుళూరు: కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలంతా జెడీఎస్కు ఓటు వేయాలని తెలంగాణ సీఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలలోపు రైతుల ఎజెండాను ప్రజల ముందుకు తీసుకొస్తామని కెసిఆర్ ప్రకటించారు. రైతులు, సామాన్యలు, ప్రజల ఫ్రంట్గా దీన్ని తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ బెంగుళూరులో శుక్రవారం నాడు మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడతో సమావేశమయ్యారు. దేవేగౌడతో సమావేశంలో సినీ నటుడు ప్రకాష్రాజ్ కూడ పాల్గొన్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం కెసిఆర్ పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి బెంగుళూరు వెళ్ళారు.
మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడతో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుమారు రెండు గంటలకు పైగా చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.

దేశ రాజకీయాలపై చర్చించాం
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టుగా మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ ప్రకటించారు.ఈ పరిస్థితులపై తెలంగాణ సీఎం కెసిఆర్తో చర్చించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ఫ్రంట్ పనిచేయనున్నట్టు చెప్పారు. కెసిఆర్ ను తాను సంపూర్ణ సహయ సహకారాలు అందించనున్నట్టు ఆయన ప్రకటించారు.

జెడిఎస్కు ఓటేయాలని తెలుగు ప్రజలకు కెసిఆర్ పిలుపు
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో జెడిఎస్కు ఓటు వేయాలని తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో తనకు దేవేగౌడ అండగా నిలిచారని ఆయన గుర్తు చేసుకొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను దేవేగౌడతో కలిసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో తాను రెండోసారి దేవేగౌడను కలిసినట్టు చెప్పారు.

ఇన్నేళ్ళుగా కావేరీ సమస్య ఎందుకు పరిష్కరించలేదు
దేశంలో సుమారు 65 ఏళ్ళ పాటు కాంగ్రెస్, బిజెపిలు పాలించాయని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. అయితే 7 దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ వివాదాన్ని ఈ రెండు పార్టీలు ఎందుకు పరిష్కరించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కావేరీ నీటి కోసం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో మిగులు నీళ్ళున్నా వీధి పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు.70 వేల టిఎంసిల నీరుంటే 25 వేల కోట్ల ఎకరాలు సేద్యం చేసే భూమి మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు.నీటి యుద్దాలకు కారణమేమవరని ఆయన ప్రశ్నించారు.30 వేల టిఎంసీల మిగులు జలాలున్నా పట్టించుకొనే పరిస్థితి లేదన్నారు.

దేశం కోసం ఎజెండా
2019 ఎన్నికల లోపుగా దేశం ముందు ఎజెండాను ఉంచుతామని తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు. సామాన్యులు, రైతులు, ప్రజల ఫ్రంట్గా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. రైతుల ఎజెండాను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు, కర్ణాటక బిడ్డని కెసిఆర్ చెప్పారు. పేదల కోసం ప్రకాష్రాజ్ పనిచేస్తున్నాడని ఆయన గుర్తు చేశారు.

ప్రధాని కావడానికి చర్చించలేదు
ఒక వ్యక్తి ప్రధాన మంత్రి కావడం కోసం ఈ సమావేశాలు జరగడం లేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే చర్చించినట్టు చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పుల కోసం చర్చించారు. ఈ మేరకు మేథోమథనం జరుగుతుందని ఆయన చెప్పారు. తాను ఎవరీకీ కూడ వ్యతిరేకం కాదని ప్రకాష్ రాజ్ చెప్పారు.












Click it and Unblock the Notifications