ప్రతీకారం: నరేంద్ర మోడీకి పాక్ ఉగ్రవాదుల బెదిరింపు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తీవ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు రోజుల క్రితం వాఘా సరిహద్దులో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 65 మందికి పైగా మృతి చెందారు. ఈ చర్యను మోడీ ఖండించారు. ఈ నేపథ్యంలో తీవ్రవాద గ్రూప్ మోడీ పైన మండిపడుతూ ట్వీట్ చేసింది.
తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ జమాత్ అహ్రప్ అధికార ప్రతినిధి ఎహ్సానుల్లా ఈషాన్ ట్విట్టర్లో సోమవారం ఓ సందేశం పోస్ట్ చేశాడు. నీవు వందలాది ముస్లీంలను చంపిన హంతకుడివి అని, కాశ్మీర్, గుజరాత్ ఇన్నోసెంట్ ప్రజల తరఫున తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు.
కాగా, పాకిస్తాన్లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 65 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.

భారత్-పాక్ల మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్ అయిన వాఘా వద్ద ప్రతి రోజూ ఇరుదేశాల సైనికులు జరిపే కవాతు ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు జరిగింది. ఇది ఆత్మాహుతి దాడి అని, కనీసం 65 మంది చనిపోగా, 200 మంది దాకా యపడినట్లు అధికారులు చెప్పారు.
వాఘా సరిహద్దు వద్ద రేంజర్స్ కవాతు కార్యక్రమాన్ని తిలకించిన తర్వాత పెద్ద సంఖ్యలో జనం తిరిగి వెళ్తున్న సమయంలో బయటకు వెళ్లే గేట్లలో ఒకదాని సమీపంలో ఒక మానవ బాంబు తనను పేల్చేసుకున్నాడని పంజాబ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ముస్తాక్ సుఖేరా చెప్పారు. చనిపోయినవారిలో ముగ్గురు పాకిస్తాన్ రేంజర్స్ జవాన్లు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.రేంజర్స్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిందని, అయితే ఆత్మాహుతి దాడులను ఆపడం కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
కాగా, ఈ దాడి తామే జరిపినట్లు అల్ఖైదాకు అనుబంధంగా ఉన్న జనదుల్లా మిలిటెంట్ గ్రూపు ప్రకటించుకున్నట్లు ‘ఎక్స్ప్రెస్ న్యూస్' చానల్ తెలిపింది. మొహరం దృష్ట్యా పాక్ ప్రభుత్వం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లుచేసినప్పటికీ ఈ పేలుడు సంభవించడం గమనార్హం. ఈ ఆత్మాహుతి దాడిని మోడీ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్య అని ఆదివారం రాత్రి ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications