నేను బతికుండాలంటే.. 'జేడీఎస్'ను గెలిపించండి: హెచ్.డి కుమారస్వామి
బెంగళూరు: జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సీఎం అభ్యర్థి హెచ్.డి కుమారస్వామి చివరి రోజు ప్రచారంలో భావోద్వేగపూరితంగా మాట్లాడారు. 'నేను బతికి ఉండటం చూడాలంటే మీరు నన్ను గెలిపించాలని' ఓటర్లను ధీనంగా వేడుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాజరాజేశ్వరి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన అనారోగ్యాన్ని ఓటర్లకు గుర్తుచేస్తూ.. 'అన్ని ఆటంకాలను అధిగమించి 113సీట్లను గెలిచేందుకు పార్టీ తరుపున అలుపు లేకుండా పనిచేస్తున్నా.
కర్ణాటక ఎన్నికలపై బుకీల అంచనా ఏంటి?: రూ.3వేల కోట్ల బెట్టింగ్..
మీ కుమారన్న బతికి ఉండాలంటే మీరు మమ్మల్ని గెలిపించాలి. మీరు నన్ను గెలిపిస్తే.. నేను మిమ్మల్ని బిడ్డ లాగా కాపాడుతాను. మీకు మాత్రమే నన్ను కాపాడే శక్తి ఉంది, మీకు సేవ చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను' అని ఓటర్లతో చెప్పారు.
తమ పార్టీ అభ్యర్థులకు నిధులను సమకూర్చడంలో తాము నిస్సహాయులుగా ఉన్నామని కుమారస్వామి చెప్పారు. 'ప్రతీ ఒక్కరు డబ్బు కావాలంటున్నారు. మా అభ్యర్థులకు నేను ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావాలి? విరాళాల ద్వారానే నిధులు సేకరించి అభ్యర్థులకు ఇస్తాను' అని తెలిపారు. రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు, రైతులు తాము దాచుకున్న డబ్బును జేడీఎస్ కు విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు.
కాగా, అంతకుముందు ఆయన మీడియాతో సమావేశం కావాల్సి ఉండగా.. జ్వరం, దగ్గు కారణంగా దాన్ని రద్దు చేసుకున్నారు. వైద్యులు కుమారస్వామిని విశ్రాంతి తీసుకోవాలని చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం ప్రచారానికే సిద్దపడ్డారు.