రోడ్డుపైనే దుస్తులు విప్పించి.. ఆపై బెల్టుతో
అహ్మదాబాద్ : గుజరాత్ లో గోసంరక్షణ సమితి కార్యకర్తలు నలుగురు వ్యక్తులపై చేసిన దాడి స్థానికంగా కలకలం రేపుతోంది. గోవు చర్మాలను తరలిస్తున్నారన్న కారణంగా నలుగురు యువకులపై దాడులకు తెగబడ్డ గోసంరక్షణ సమితి కార్యకర్తలు, యువకుల దుస్తులు విప్పించి, కారుకు కట్టేసి రోడ్డుపై అందరూ చూస్తుండగానే చితకబాదారు.
గుజరాత్ లోని గిర్ సోమ్ నాథ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన జరగ్గా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, గోసంరక్షణ సమితి కార్యకర్తలు యువకులపై దాడి చేయడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది.
#WATCH Suspected cow leather smugglers thrashed by cow protection vigilantes in Somnath (Gujarat) (11.7.16)https://t.co/UTA4qmAPRm
— ANI (@ANI_news) July 12, 2016
యువకులను కారుకు కట్టేసిన అనంతరం కర్రలు, బెల్టుతో వారిని చితకబాదారు గోసంరక్షణ సమితి కార్యకర్తలు. ఇదిలా ఉంటే బాధితులంతా దళిత వర్గానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. ఆవు చర్మాన్ని, బీఫ్ ను తరలిస్తున్నట్టుగా తమపై గోసంరక్షణ సమితి చేసిన ఆరోపణలను వారు ఖండించారు.
తమ విధుల్లో భాగంగానే జంతువుల కళేబరాలను తరలిస్తుంటామని చెప్పిన బాధితులు.. చనిపోయిన ఓ ఆవు కళేబరాన్ని తీసుకెళుతుండగా గోసంరక్షణ కార్యకర్తలు దాడి చేసినట్టుగా తెలిపారు. అయితే విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.