ముంబై విమానాశ్రయంలో ఏపీవాసికి గుండెపోటు, ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ ఆఫీసర్(వీడియో)
ముంబై: మహారాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో ఓ సెక్యూరిటీ అధికారి గుండె జబ్బుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. ఈ సంఘటన అక్టోబర్ 26వ తేదీన ముంబై ఆసుపత్రిలో జరిగింది. అనంతరం గుండె జబ్బుతో బాధపడిన వ్యక్తిని నానావతి ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
సదరు సెక్యూరిటీ ఆఫీసర్ దాదాపు 30 సెకన్ల పాటు సీపీఆర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంది.
మోహిత్ కుమార్ శర్మ అనే సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారి అక్టోబర్ 26న విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో గుబ్బల సత్యనారాయణ అనే వ్యక్తి విమానాశ్రయంలో ఉన్నారు. గుబ్బల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. అతను ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమానాశ్రయానికి వచ్చారు.
#WATCH: CISF ASI Mohit Kumar Sharma along with two other CISF personnel gave Cardiopulmonary resuscitation (CPR) to a passenger who suffered cardiac arrest at Mumbai Airport on Oct 26. The passenger was later shift to Nanavati Hospital & his condition is stable now. pic.twitter.com/cAEmBTaZfF
— ANI (@ANI) October 28, 2018
టెర్మినల్ 2 సమీపానికి రాగానే సత్యనారాయణకు గుండెపోటు వచ్చింది. అది చూసిన అధికారి శర్మ వెంటనే అక్కడకు వచ్చారు. సత్యనారాయణకు సీపీఆర్ చేశారు. అనంతరం అతనిని నానావతి ఆసుపత్రికి తరలించారు.
ఇలాంటి సంఘటనే ఈ ఏడాది జూలైలో కూడా జరిగింది. అమెరికాకు చెందిన ఓ ప్రయాణీకుడికి ఢిల్లీ విమానాశ్రయంలో గుండెపోటు వచ్చింది. అతను అప్పుడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అప్పుడు కూడా అక్కడి అధికారి సీపీఆర్ చేశారు.