రుతుపవనాల ఎంట్రీ: ముంబైలో భారీ వర్షాలు, నీటమునిగిన రోడ్లు, రైల్వే ట్రాక్లు
ముంబై: నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతోనే మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం రాత్రి నుంచీ ముంబైతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బుధవారం ఉదయం కురిసన భారీ వర్షం కారణంగా ముంబై మహా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు నీట మునగడంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. ముంబైలోని కొలాబాలో అత్యధికంగా 65.4 మిల్లిమీటర్లు, శాంతక్రూజ్లో 50.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరో ఐదు రోజులపాటు ముంబై, శివారు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయ్గఢ్, థానే, పాల్ఘర్, నాసిక్ తదితర జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వం అప్రమత్తమై, ముందస్తు చర్యలు చేపడుతోంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 10న నైరుతి రుతుపవనాలు ముంబైని తాకుతాయని, అయితే, ఈ సారి మాత్రం ఒకరోజు ముందుగానే ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించనుననట్లు పేర్కొంది. రుతుపవనాలు ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ మరో రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Maharashtra: Railway tracks submerged between Sion railway station & GTB Nagar railway station due to heavy rainfall in Mumbai.
— ANI (@ANI) June 9, 2021
Mumbai Local train services b/w Kurla & CSMT have been halted, as a precautionary measure; services to resume as soon as the water recedes.#Monsoon pic.twitter.com/YUaETnmv7z
కాగా, ప్రతి ఏడాది జూన్ 1నే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. కానీ, ఈసారి మాత్రం రెండు రోజులు ఆలస్యంగా వచ్చాయి. అయితే, ఈ ఏడాది మాత్రం దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదు కానున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.