టికి ఎఎపి పార్టీ ఓకే కానీ..: ఢిల్లీకి మారిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన మద్దతును ప్రకటించింది. శనివారం ఆప్ పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆప్ మద్దతిస్తుందని చెప్పారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే అదే సమయంలో సీమాంధ్ర ప్రజల హక్కులు, హైదరాబాద్ ప్రత్యేకతకు సంబంధించిన భావనలను పరిగణనలోకి తీసుకోవాలని యోగేంద్ర అన్నారు. అదేవిధంగా చట్టపరమైన, రాజ్యాంగ పరమైన సీమాంధ్ర హక్కులను గౌరవించడంతోపాటు, నదీ జలాల పంపకాలు ఇరు ప్రాంతాలకు సంతృప్తికరమైన రీతిలో సాగాలన్నారు.
కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఎఎపి సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తన నివాసాన్ని న్యూఢిల్లీకి మార్చారు. ఇప్పటి వరకు ఢిల్లీ నగరం వెలుపల కౌషంబి ప్రాంతంలోని గిర్నార్ అపార్ట్మెంట్లో తన కుటుంబంతో సహా నివసిస్తున్న కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని తిలక్ లేన్కు మారారు. దీనితో ఇప్పటివరకు కేజ్రీవాల్కు కల్పిస్తున్న ‘జెడ్' కేటగిరి భద్రతను ఉపసంహరించుకోవడానికి యూపి ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం కేజ్రీవాల్కు 24 గంటలపాటు భద్రతను కల్పించడానికి 30 మంది పోలీసులును యూపి ప్రభుత్వం నియమించింది. అంతేకాక, కేజ్రీవాల్ ఘజియాబాద్లో ఎక్కడికైనా వెళితే రెండు పోలీసు వాహనాలు ఆయనకు భద్రతను కల్పిస్తున్నాయి. కాగా విఐపి సంస్కృతిని నిర్మూలిస్తామని ఆప్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్, తనకు కల్పించిన భద్రతను తిరస్కరించారు. అయినప్పటికీ పోలీసులు కేజ్రీవాల్కు భద్రతను కల్పిస్తున్నారు.
మరోవైపు అవినీతిపరుల లిస్టులో నరేంద్ర మోడీ, సోనియా గాంధీ పేరులను పెట్టడంపై ఎఎపి వివరణ ఇచ్చింది. వారు పార్టీలోని అవినీతి నేతలను రక్షిస్తున్నారని ఎఎపి చెప్పింది. అయితే, కేంద్రమంత్రి కపిల్ సిబాల్ అవినీతికి ఆధారాలు చూపించాలని సవాల్ చేయగా, అవినీతి చిట్టాపై బిజెపి మండిపడింది.