ఢిల్లీలో హింసకు కారణాలు తెలుసా? అల్లర్లు ఇలా మొదలు.. 1984 రిపీట్ కానివ్వబోమన్న హైకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో హింస ప్రజ్వరిల్లడం.. నాలుగు రోజుల వ్యవధిలో 20 మంది చనిపోవడం దేశప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలవాళ్లూ జీవిస్తుంటారు.. తమవాళ్ల యోగక్షేమాలపై వారి బంధువులు ఆందోళన చెందుతున్న దృశ్యాలు అంతటా కనిపిస్తున్నాయి. ఢిల్లీ అల్లర్లపై ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు బుధవారం కీలక విచారణలు చేపట్టాయి. మొత్తంగా మోదీ సర్కారు ఆధ్వర్యంలోని పోలీసు వ్యవస్థ విఫలమైన కారణంగానే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని సుప్రీం, హైకోర్టు జడ్జిలు వ్యాఖ్యానించారు.
ఢిల్లీ అల్లర్లలో అన్ని ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు.. మృతులకు, బాధితులకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు అనూహ్య తీర్పు వెల్లడించింది. 1984నాటి సిక్కుల ఊచకోత లాంటి పరిస్థితులు తలెత్తరాదని, వెంటనే హింసను అదుపు చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ప్రస్తుత హింసలో నష్టపోయినవాళ్లకు తగిన పరిహారం అందించాలని తీర్పు చెప్పింది. విచారణ సందర్భంగా హింసకు దారితీసిన కారణాలపై వాదనలిలా ఉన్నాయి..
Recommended Video


కేసులు పెట్టాల్సిందే..
ఢిల్లీ చరిత్రలో సిక్కుల ఊచకోత(1984) తర్వాత.. అత్యంత భయానకంగా అల్లర్లు చెలరేగడం ఇదే మొదటిసారి. 2014 నుంచి 2018దాకా అడపాదడపా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ప్రస్తుతం నెలకొన్నంత ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. గత శనివారం నుంచి మొదలైన హింసాకాండలో ఈశాన్య ఢిల్లీలోని 10 ప్రాంతాలు అట్టుడికిపోయాయి. పదుల కొద్దీ ఫ్యాక్టరీలు, వందలకొద్దీ దుకాణాలు కాలిబూడిదయ్యాయి. మందిరాలు, మసీదులు, దర్గాలు ధ్వంసమయ్యాయి. బుధవారం నాటికి మొత్తంగా 20 మంది చనిపోగా, వందలమంది గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అన్ని హింసాత్మక ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలివ్వాలంటూ దాఖనైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారించింది.

ఎలా మొదలైందంటే..
పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఢిల్లీ అల్లర్లు ఎలా మొదలయ్యాయో కోర్టుకు వివరించారు. గతేడాది డిసెంబర్ లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాతిరోజు నుంచే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని షాహీన్ బాగ్ తోపాటు చాలా చోట్ల రోడ్లను బ్లాక్ చేస్తూ నిరసనకారులు ధర్నాలు నిర్వహించారు. నెలల తరబడి రోడ్లను దిగ్భందించడంపై కోర్టులు కూడా ఆగ్రహం వ్యక్తంచేశాయి. అయితే నిరసన తెలిపే హక్కును మాత్రం న్యాయస్థానం కాదనలేదు. ఆ తర్వాతి కాలంలో నిరసనలకు వ్యతిరేకంగా.. బీజేపీ నేతృత్వంలో సీఏఏ అనుకూల ర్యాలీలు దేశమంతటా జరిగాయి. ఆ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆధ్వర్యంలో గత శుక్రవారం జరిగిన ప్రదర్శన తీవ్ర హింసకు దారితీసింది..

కపిల్, అనురాగ్ వీడియోలు చూడలేదా?
బీజేపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే ఢిల్లీ పరిస్థితి హింసాత్మకంగా మారిందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ నేత కపిల్ మిశ్రా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ పర్వేశ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను తాము చూడలేదని పోలీసులు చెప్పడంతో కోర్టు విస్మయం చెందింది. ‘‘నిజమా? మీరు ఆ వీడియోలు చూడలేదంటే మేం నమ్మాలా? మీ కమిషనరేట్ లో టీవీలు లేవా? కనీసం ఇంట్లో వార్తలు చూసేటప్పుడైనా అవి మీ దృష్టికి రాలేదా?''అంటూ జడ్జి జస్టిస్ మురళీధర్ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పటికప్పుడు కోర్టు హాలులో వీడియోలు ప్రదర్శించారు. ఇంతకీ కపిల్ మిశ్రా ఏమన్నాడంటే..

మీరు బ్లాక్ చేసిన రోడ్లను తెరిపిస్తాం..
‘‘సీఏఏకు వ్యతిరేకంగా మీరు(నిరసనకారులు) రెండు నెలలుగా షాహీన్బాగ్ను దిగ్భందించారు. ఒక్క షాహీన్ బాగే కాదు.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో టెంట్లువేసి నిరసనలు చేస్తున్నారు. అదే సీఏఏ చట్టానికి అనుకూలంగా మేం ఉద్యమిస్తాం.. మీరు బ్లాక్ చేసిన రోడ్లను తెరిపించడమే మా పని. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన ముగించుకుని వెళ్లేదాకా మీకు టైమిస్తున్నాం. ఆలోపు ధర్నాచౌక్ లు ఎత్తేసి రోడ్లు ఖాళీ చేయండి. లేకపోతే తరిమికొడతాం..''అంటూ ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా వార్నింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే.. ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక ధర్నా చౌక్ లపై దాడులు జరిగాయి.

చావుకు మతం లేదు..
పక్కా పథకం ప్రకారం అల్లర్లకు రూపకల్పన జరిగిందని, యువతను రోడ్ల మీదికి తీసుకొచ్చి, ట్రక్కల ద్వారా రాళ్లు, ఇటుక ముక్కలను సరఫరా చేశారని, గ్రౌండ్ లెవెల్ లో పోలీసులు కూడా ఊహించలేనంత పకడ్బందీగా ధ్వంసరచన జరిగిందని పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు. అల్లర్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, రెండు మతాలకు చెందినవాళ్లూ చనిపోయినందున ఎలాంటి పక్షపాతం లేకుండా పరిహారం చెల్లించాలని కోరారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆ మేరకు కేసుల నమోదు, పరిహారం చెల్లింపుపై సర్కారుకు ఆదేశాలిచ్చింది.












Click it and Unblock the Notifications