మనసుల్లోనే ఉంది: అసహనంపై మరోసారి ప్రణబ్
గాంధీనగర్: దేశంల అసహనంపై లోకసభలో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి అసహనంపై స్పందించారు. దేశంలో నిజమైన చెత్త రోడ్లపై లేదని.. ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. అహ్మదాబాద్లో సబర్మతీ ఆశ్రమంలో జరిగిన 62వ గుజరాత్ విద్యాపీట్ స్నాతకోత్సవంలో ప్రణబ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల్లో అసహనం గురించి మాట్లాడుతూ.. సమాజాన్ని విభజించే భావజాలాన్ని మన మనసుల్లోంచి తీసివేయడానికి ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. భారత్ అహింస అనే సూత్రం ఆధారంగా ఏర్పడిందని, ఎంతో వైవిధ్యమైన దేశమని ఆయన గుర్తు చేశారు. భారత్లో వైవిధ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు.
భారత్ సంఘటిత దేశంగా ఉండాలని గాంధీ కలలు కన్నారని చెప్పారు. ఇక్కడ అన్ని రకాల ప్రజలు సమానమని, అందరూ సమానంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలని, ఆనందంగా ఉండాలని అన్నారు.
మనుషులపై ఒకరికొకరికి నమ్మకం ఉండాలని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. గాంధీ ఉద్దేశంలో స్వచ్ఛ భారత్ అంటే కేవలం పరిశుభ్రమైన భారత్ మాత్రమే కాదని, స్వచ్ఛమైన మనసు, వాతావరణం అని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు.
అసహనం వీధుల్లో లేదు.. మన ఆలోచనల్లోనే ఉందని పేర్కొన్నారు. శాంతి, చర్చకు ఉన్న శక్తిని మరిచిపోవద్దు అని తెలిపారు. అందరం ఒక్కటేనన్న ఆలోచన ఉంటే మనసు పరిశుద్ధమవుతుందన్నారు.
ముద్రణ రూపంలోకి గాంధీజీ లేఖలు
జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనలు, తన సమకాలికులతో ఆయన పంచుకున్న భావాలకు సంబంధించిన 8500 లేఖలను సబర్మతి ఆశ్రమం ముద్రణ రూపంలో తీసుకురానున్నది. వాస్తవానికి గాంధీజీకి సంబంధించిన లేఖలు 31వేలకు పైగా ఉన్నట్లు కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మాగాంధీ(సీడబ్యూఎంజీ) చెప్తున్నది. వీటిని ప్రతిలేఖించేందుకు, ముద్రించేందుకు పరిశోధకులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారని సబర్మతి ఆశ్రమ్ ప్రిజర్వేషన్, మెమోరియల్ ట్రస్టు డైరెక్టర్ త్రిదీప్ శారూద్ తెలిపారు.
గాంధీజీ లేఖలను ముద్రించడం ద్వారా రొమైన్ రోలాండ్, రవీంద్రనాథ్ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీనాయుడు, మీరాబెన్ వంటి ఆనాటి మహనీయులతో ఆయన పంచుకున్న ఆలోచనలను వెలుగులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
సీడబ్ల్యూఎంజీ వద్ద గాంధీజీ ప్రసంగాలకు సంబంధించిన 100 వాల్యూమ్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంటేషన్, సంపాదకీయాలు, ఇతర రచనలు, 31వేల లేఖలు, టెలిగ్రామ్లు వంటివి ఉన్నాయని త్రిదీప్ పేర్కొన్నారు. గాంధీజీ లేఖలు ప్రధానంగా ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ భాషల్లో రాసి ఉన్నట్లు తెలిపారు.