West Bengal Exit Poll : బెంగాల్ గడ్డపై దీదీ హ్యాట్రిక్ పక్కా... సీఎన్ఎన్,పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు...
బెంగాల్ గడ్డపై మరోసారి దీదీ హవా ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తాజాగా సీఎన్ఎన్ న్యూస్ 18,పీ-మార్క్(P-MARQ) ఎగ్జిట్ పోల్ సర్వేలో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు వెల్లడైంది.
సీఎన్ఎన్ న్యూస్-18 ఎగ్జిట్ పోల్ ప్రకారం... మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 162,బీజేపీ 115,కాంగ్రెస్-వామపక్ష కూటమి 15 స్థానాల్లో గెలుపొందనున్నాయి.
పీ-మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం... టీఎంసీ 152-172 స్థానాల్లో,బీజేపీ 112-132 స్థానాల్లో,కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-20 స్థానాల్లో గెలుపొందనున్నాయి.
ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం... టీఎంసీ 164-176 స్థానాల్లో,బీజేపీ 105-115 స్థానాల్లో,కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-15 స్థానాల్లో గెలుపొందనున్నాయి.
బెంగాల్లో మార్చి 27తో మొదలైన ఎన్నికలు ఏప్రిల్ 29తో ముగియనున్నాయి. మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి ఎన్నికల్లో బెంగాల్ గడ్డపై ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ భావిస్తుండగా... హ్యాట్రిక్ కొట్టాలని టీఎంసీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్,వామపక్ష పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ టీఎంసీ-బీజేపీ మధ్య కనిపిస్తోంది.
మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా సాగాయి. తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ నాయకులు పదేపదే 'ఖేలా హోబ్..' (ఆట మొదలైంది.) అంటూ సవాల్ విసురుకున్నారు. బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డనే పాలించాలన్న నినాదంతో మమతా బెనర్జీ ప్రచారం సాగించారు. మరోవైపు టీఎంసీ పదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని... ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ప్రచారం చేసింది. నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో దీదీ కాలికి గాయమవడం,పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం వంటి పరిణామాలు బెంగాల్ ఎన్నికలను మరింత హీటెక్కించాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
బెంగాల్లో టీఎంసీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీని ఎదుర్కోగల శక్తి,సత్తా తనకు ఉందని మమతా బెనర్జీ నిరూపించినట్లవుతుంది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించే అవకాశం దీదీకి దక్కుతుంది. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు దీదీ ప్రయత్నాలు సాగించిన సంగతి తెలిసిందే. దీదీ మూడోసారి సీఎం అయితే జాతీయ స్థాయిలో ఆమె నాయకత్వం వహించే ప్రయత్నాలు ముమ్మరం కావచ్చు.