West Bengal Opinion polls:మమతా జోరు ముందు మోడీ బేజారు..బెంగాల్ పీఠం తృణమూల్దే..!
పశ్చిమ బెంగాల్: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే ఒపీనియన్ పోల్స్ హడావుడి ప్రారంభమైంది. జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ మరియు సీ ఓటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో ఓటర్ల నాడి ఎలా ఉందో ఏ పార్టీని వారు ఆదరిస్తున్నారో అనే కీలక అంశాలను సర్వే చేసి వెల్లడించింది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పశ్చిమ బెంగాల్లో వార్ మోడీ వర్సెస్ మమతాగా మారింది. పశ్చిమ బెంగాల్లో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, మరియు కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య పోరు జరగనుంది. ఇక ఈ రాష్ట్రంలో ఓటరు నాడి ఎలా ఉందో చూద్దాం.
పశ్చిమ బెంగాల్లో దీదీ మళ్లీ పట్టు నిలుపుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏబీపీ - సీఓటర్ సర్వే వెల్లడించింది. మోడీ-షా ద్వయంను మమతా బెనర్జీ గట్టిగా ఎదుర్కొని తిరిగి ముచ్చటగా మూడోసారి బెంగాల్ పీటంను అధిష్టించనున్నట్లు ఒపీనియన్ పోల్ ద్వారా తెలుస్తోంది. మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి, మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 148 నుంచి 164 సీట్లను సొంతం చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి టీఎంసీకి గట్టి పోటీ ఉంటుందని ఏబీపీ- సీఓటర్ సంస్థ పేర్కొంది. అయితే బీజేపీ కూడా తన అసెంబ్లీ స్థానాలను ఈ సారి మరింత మెరుగు పరుచుకుంటుందని జ్యోస్యం చెప్పింది.
బెంగాల్లో కమలం పార్టీ వికసిస్తున్నప్పటికీ దీదీ జోరును మాత్రం అడ్డుకోలేదని ఏబీపీ-సీఓటర్ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి 92 నుంచి 108 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ సారి మాత్రం భారీగా సీట్లను కొల్లగొడుతుందని సర్వే సంస్థ అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. కమ్యూనిస్టులతో జతకట్టి బరిలో దిగుతున్న కాంగ్రెస్కు ఈ సారి కూడా శృంగభంగం తప్పేలా లేదు. కాంగ్రెస్ కూటమి ఇక్కడ 31 నుంచి 39 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. 2016లో ఇదే కూటమి 76 స్థానాలను చేజిక్కించుకోగా ఈసారి దాదాపుగా సగానికి పడిపోయే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్- కమ్యూనిస్టుల కూటమి ఓటమి కమలం పార్టీకి కలిసొస్తుందని ఏబీపీ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్కు అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 8 విడతలుగా జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ ఎన్నికలు ప్రారంభం కానుండగా ఏప్రిల్ 29న చివరి దశ ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఫలితాలు మే 2న విడుదలవుతాయి.