బెంగాల్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల... నందిగ్రాంలో మమత vs సువెందు అధికారి...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 57 మంది అభ్యర్థులతో బీజేపీ తమ తొలి జాబితాను ప్రకటించింది. మొదటి,రెండో దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు మాత్రమే ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శనివారం(మార్చి 6) అభ్యర్థుల పేర్లను మీడియాకు వెల్లడించారు.
నందిగ్రాం అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సువెందు అధికారిని బీజేపీ బరిలో దింపుతోంది. మాజీ క్రికెటర్ అశోక్ దిండాను మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతోంది.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా గుర్తింపు పొందిన సువెందు అధికారి గతేడాది డిసెంబర్లో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సువెందును బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రాం నుంచే సువెందు అధికారి గెలుపొందారు. ఇప్పుడదే నియోజకవర్గం నుంచి మమత కూడా బరిలో దిగుతుండటంతో ఈ ఇద్దరి పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఒకప్పుడు నందిగ్రాంలో వేల ఎకరాల భూసేకరణకు వ్యతిరేకంగా జరిగినపోరాటంలో మమతా బెనర్జీతో పాటు సువెందు అధికారి కూడా కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పీట వేశారు మమత. టీఎంసీకి పట్టు లేని పలు జిల్లాల్లో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల్లో టీఎంసీ పాగా వేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడదే సువెందు అధికారి నందిగ్రాం మొత్తాన్ని బీజేపీ కంచుకోటగా మారుస్తానని మమతకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు 2011,2016 ఎన్నికల్లో భవాణీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమత ఇప్పుడు ఏరి కోరి నందిగ్రాం నుంచి బరిలో దిగుతుండటం గమనార్హం.
కోల్కతాలో ఆదివారం(మార్చి 6) బీజేపీ భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. నిజానికి రేపటి బహిరంగ సభలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని భావించినప్పటికీ... ఒకరోజు ముందుగానే బీజేపీ ఆ జాబితాను ప్రకటించింది.
కాగా,పశ్చిమ బెంగాల్లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications